ర్యాంకుల్లో టాపర్లుగా నిలుస్తున్నవారికి బుర్రలో గుజ్జు ఉండదా...? అని కాస్తంత ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు ఇటీవల టాపర్లు చెపుతున్న సమాధానాలు వింటున్నవారు. ఆమధ్య బీహార్ రాష్ట్రంలో పొలిటికల్ సైన్స్ అంటే ఏంటీ బాబూ అని అడిగితే... వంటశాస్త్రం అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సంగతి మరచిపోకమునుపే మరో షాకింగ్ న్యూస్ వెలికి వచ్చింది.
అదేంటయా అంటే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్లో టాపర్లుగా నిలిచిన వారికి యూపిలోని టెక్నికల్ బోర్డు 8 అంకె స్పెల్లింగును రాయమంటే అంతా గుడ్లు మిటకరించి, బిక్కమొఖం వేసుకుని చూశారు. 28 మంది విద్యార్థులు 8 అంకెను ఆంగ్లంలో ఎలా రాయాలో తెలీకపోవడంతో చెక్క ముఖం వేసుకుని నిలబడ్డారట. దీనితో పరీక్ష నిర్వహించేవారికి అనుమానం వచ్చి మరలా తాము రాయమన్నది 8 అనే అంకెకు ఆంగ్లంలో స్పెల్లింగ్ అని చెప్పారట.
ఐనా వారి నుంచి సమాధానం లేదు. దీనితో సదరు విద్యార్థుల సత్తా ఏమిటో తెలిసిపోయి ప్రవేశ పరీక్షా సమయంలో వారంతా మోసాలకు పాల్పడినట్లు తెలుసుకున్నారు. వెంటనే వారి ఫలితాలను రద్దు చేయడమే కాకుండా మళ్లీ ఆ పరీక్ష రాయకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే ఆ విద్యార్థులను ప్రవేశ పరీక్షలో అర్హులుగా చేసిన సదరు కళాశాలపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.