2జీ స్కామ్ దర్యాప్తులో సీబీఐ డైరక్టర్ రంజిత్ సిన్హా వేలుపెట్టరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అదేసమయంలో కేసు విచారణను సీబీఐ ఉన్నతాధికారులతో జరిపించాలని ఆదేశాలిచ్చింది. సీబీఐ గౌరవం పెంపొందించేలా రంజిత్ వ్యవహరించడంలేదని, కేసు వీగిపోయేలా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
రంజిత్ సిన్హాపై ఉద్యమకారుడు ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆరోపణలను ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ చేసిన విషయం తెల్సిందే. తమ సంస్థలకు 2జీ లైసెన్సులు ఇప్పించుకోడానికి నేరపూరిత కుట్రలు చేశారని ఆరోపణలున్న కంపెనీల అధికారులు రంజిత్ సిన్హాను తరచుగా ఆయన నివాసంలో కలుస్తున్నారని ప్రశాంత భూషణ్ ఆరోపించారు.