అజిత్ పవర్‌కు గట్టి ఎదురుదెబ్బ... సొంత గూటికి కీలక నేతలు

వరుణ్

బుధవారం, 17 జులై 2024 (10:41 IST)
ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో పేలవమైన ప్రదర్శన తర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని పార్టీకి పెద్ద దెబ్బ తగిలిన మహారాష్ట్రలోని పింప్రీ చించ్వాడ్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు అగ్రనేతలు రాజీనామా చేశారు. వీరంతా ఈ వారంలోనే శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీలో చేరే అవకాశం ఉంది. అజిత్ పవార్‌కు రాజీనామాలు సమర్పించిన వారిలో ఎన్‌సిపి పింప్రి-చించ్వాడ్ యూనిట్ చీఫ్ అజిత్ గవానే కూడా ఉన్నారు. ఇతరులు పింప్రీ చించ్వాడ్ స్టూడెంట్స్ వింగ్ చీఫ్ యశ్ సానే, మరియు మాజీ కార్పొరేటర్లు, రాహుల్ భోసలే మరియు పంకజ్ భలేకర్. అజిత్ పవార్ శిబిరంలోని కొందరు నేతలు తిరిగి శరద్ పవార్ గూటికి చేరేందుకు సుముఖంగా ఉన్నారనే ఊహాగానాల మధ్య రాజీనామాలు జరిగాయి.
 
శరద్ పవార్ గత నెలలో తన పార్టీని 'బలహీనపరచాలని' కోరుకునే వారిని తీసుకోబోమని, అయితే పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించని నేతలను తాను క్షమించి మళ్లీ పార్టీలో చేర్చుకుంటానని ప్రకటించారు. 'పార్టీని బలహీనపరచాలనుకునే వారిని తీసుకోబోమని.. కానీ పార్టీ పరువును దెబ్బతీయకుండా సంస్థను బలోపేతం చేసేందుకు సహకరించే నాయకులను తీసుకుంటారు' అని ఆయన అన్నారు.
 
కాగా, 2023లో అజిత్ పవార్ తన బాబాయ్, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌పై తిరుగుబాటు చేయడంతో పవార్ కుటుంబం రెండు రాజకీయ పార్టీలుగా విడిపోయింది. శరద్ పవార్ ప్రతిపక్ష శిబిరంలో ఉండగా, అజిత్ పవార్ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరి, ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 
 
అజిత్ పవార్ పార్టీ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో భాగంగా లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసింది, అయితే కేవలం ఒక సీటును మాత్రమే గెలుచుకోగా, శరద్ పవార్ సారథ్యంలోని పారటీ ఎనిమిది సీట్లలో గెలిచింది. దీంతో అజిత్ పవార్ వైపు ఉన్న పలువురు కీలక నేతలు ఇపుడు మళ్లీ శరద్ పవార్ వైపు మొగ్గు చూపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు