427 మందికి బ్లాక్ మనీ ఖాతాలు, పేర్లు త్వరలో వెల్లడిస్తాం!: జైట్లీ

బుధవారం, 26 నవంబరు 2014 (20:00 IST)
దేశంలో 427 మందికి విదేశాల్లో బ్లాక్ మనీ ఖాతాలున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్య సభకు తెలియజేశారు. నల్లధనంపై రాజ్య సభలో ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో ఖాతాలున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నోటీసులు పంపిందని అన్నారు. 427 మందిలో 250 మంది తమకు విదేశాల్లోని హెచ్ఎస్ బీసీలో ఖాతాలున్నాయని అంగీకరించారని జైట్లీ సభకు వివరించారు. చట్టానికి లోబడి ఉన్న ఖాతాల జోలికి వెళ్లమని ఆయన స్పష్టం చేశారు.
 
నల్లధనంపై ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని అరుణ్ జైట్లీ వివరించారు. కొన్ని వారాల్లో మరిన్ని కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. విచారణ ప్రారంభమయ్యాక వారి పేర్లు వెల్లడిస్తామన్నారు. దీంతో, నల్లధనంపై ప్రభుత్వ స్పందనకు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

వెబ్దునియా పై చదవండి