సోలార్ ప్యానెల్ స్కామ్ : సరితా నాయర్‌కు ఆరేళ్ళ కఠిన జైలుశిక్ష

బుధవారం, 28 ఏప్రియల్ 2021 (08:38 IST)
గతంలో కేరళలోని కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ సంకీర్ణ ప్రభుత్వంలో వెలుగు చూసిన స్కామ్ సోలార్ కుంభకోణం. ఈ స్కామ్ ఆ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది. ఈ కేసులో తుదితీర్పును కోర్టు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన సరితా నాయర్‌కు కోర్టు ఆరేళ్ళ కఠిన కారాగారశిక్షను విధించింది. 
 
కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఈ కుంభకోణంలో సరిత రెండో నిందితురాలు. మూడో నిందితుడైన బి.మణిమోన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌–3 కె.నిమ్మి మంగళవారం తీర్పు వెలువరించారు. మొదటి నిందితుడైన బిజు రాధాకృష్ణన్‌ ప్రస్తుతం కోవిడ్‌తో క్వారంటైన్‌లో ఉండటంతో జడ్జి అతడికి సంబంధించిన తీర్పును తర్వాత వెలువరించనున్నారు.
 
ఈ కేసులో మోసం సహా నాలుగు నేరాలకుగాను కోర్టు జైలు శిక్షలతోపాటు, రూ.10 వేల చొప్పున రూ.40 వేల జరిమానా కూడా విధించింది. కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో గత వారమే పోలీసులు సరితను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 
 
కంపెనీ ఫ్రాంచైజీ ఇప్పించడంతోపాటు తన నివాసం, కార్యాలయాల్లో సోలార్‌ ప్యానెళ్లను అమరుస్తామంటూ సరితా నాయర్, బిజు రాధాకృష్ణన్‌ రూ.42.70 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ కోజికోడ్‌కు చెందిన అబ్దుల్‌ మజీద్‌ 2012లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, నిందితులిద్దరూ రాష్ట్రంలోని పలువురి నుంచి కోట్లాది రూపాయలను మోసపూరితంగా వసూలు చేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు సరితా నాయర్‌ను దోషిగా తేల్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు