భారత సైనిక సామర్థ్యం - సాంస్కృతిక వైభవం.. ఘనంగా రిపబ్లిక్ పరేడ్

బుధవారం, 26 జనవరి 2022 (09:22 IST)
భారత 73వ గణతంత్ర వేడుకలు యావత్ భారతావనిలో ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లు పూర్తయ్యాయి. దీంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో వేడుకలు జరుగుతున్నాయి. మరోవైపు భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించి 73 యేళ్లు పూర్తయ్యాయి. దీంతో భారత సైనిక సామర్థ్యాన్ని, దేశ సాంస్కృతి వైభవాన్ని చాటిచెప్పేలా రాజ్‌పథ్ వద్ద రిపబ్లిక్ పరేడ్‌ను రక్షణ శాఖకు చెందిన త్రివధ దళాలు నిర్వహించాయి. 
 
తొలుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గౌవర వందనం స్వీకరించారు. ఆ తర్వాత ప్రధాన కార్యక్రమంలో 16 కవాతు విభాగాలు పాలుపంచుకున్నాయి. సైన్యం, నౌకాదళం, వాయుసేన, కేంద్ర పారామిలటరీ దళాలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలు భాగస్వామ్యంతో ఈ పరేట్ నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 విమానాలతో భారత వాయుసేన విన్యాసాలను ప్రదర్శించింది. ఇందులో అత్యాధునికమైన రఫేల్, సుఖోయ్, జాగ్వర్, అపాచీ వంటి యుద్ధ విమానాలు పాలుపంచుకున్నాయి.
 
అదేవిధంగా ఈ గణతంత్ర వేడుకల్లో మొత్తం 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలతో కవాతు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన శకటాలకు ఈ దఫా చోటు దక్కలేదు. ఈ వేడుకల్లో తొలిసారి 480 మంది కళాకారులతో వివిధ రకాలైన సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా వందే భారత్ డ్యాన్స్ పోటీలను కూడా నిర్వహించి ఈ సాంస్కృతిక కళా పోటీలకు కళాకారులను ఎంపిక చేయడం గమనార్హం. 
 
అదేసమయంలో కోవిడ్ నేపథ్యంలో పలు కఠిన ఆంక్షలు అమలు చేశారు. దీంతో ఈ పరేడ్‌ను వీక్షించే వారి సంఖ్యను బాగా కుదించారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న పెద్దలు, ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న 15 యేళ్ల పైబడిన చిన్నారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే, భౌతిక దూరం పాటించేలా సీటింగ్‌ను ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు