దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. అపుడు అధికార సమాజ్వాదీ పార్టీ వంతు వచ్చింది. దీంతో మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎస్పీ యువనేత అఖిలేష్ యాదవ్ ఓటర్లను ఆకర్షించుకునే 'స్మార్ట్' హామీ ఇచ్చారు.
ఇదే అంశంపై ఆయన ఓ ప్రకటన చేశారు. ‘సమాజ్వాది స్మార్ట్ఫోన్ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ప్రజలకు అధునాతన ఫీచర్లు ఉన్న స్మార్ట్ఫోన్లను అందించనున్నారు. ప్రభుత్వ పథకాలు తెలుసుకునేందుకు, పేద ప్రజలను విద్యావంతులు చేసి సమాచారాన్ని ఒకరికొకరు తెలియజెప్పుకునేందుకు సులువుగా ఉంటుందని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అన్ని రకాల యాప్స్తో పాటు, ఫేస్బుక్ ఉపయోగించి ప్రభుత్వ పథకాలు ప్రజలు నేరుగా తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో నివసిస్తూ 18 సంవత్సరాలు నిండిన ఎవరైన ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబం ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
వచ్చే వారం నుంచి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లను ఆన్లైన్లో చేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నారు. లబ్ధిదారులకు ఈ స్మార్ట్ఫోన్లను హోం డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. యువతను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. అయితే స్మార్ట్ఫోన్లను 2017 రెండో భాగంలో పంపిణీ చేస్తామని పేర్కొనడం గమనార్హం.