అమెరికా దెబ్బకు జడుసుకుని పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాది జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ను తప్పనిసరి పరిస్థితుల్లో గృహనిర్బంధంలోకి తీసుకున్నప్పటికీ దాని బుద్ది ఏమాత్రం మారలేదనేందుకు దాఖలాలు కనిపిస్తున్నాయి. అమెరికాకు భయపడి హఫీజ్ని అరెస్టు చేయలేదని, జాతి ప్రయోజనాల కోసమే అతడిని అదుపులోకి తీసుకున్నానని పాక్ నాలుక మడత పెట్టినప్పుడే దాని ద్వంద్వ స్వభావం బాగా అర్థమైంది. ఇప్పుడు హఫీజ్ నేరం చేసి ఉండే పకడ్బందీ ఆధారాలు చూపించాలని చెప్పిన పాక్ మరోసారి భారత్కు జలక్ ఇచ్చింది.
పాక్ సమాధానానికి భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పందిస్తూ ముంబయి దాడికి సంబంధించిన ప్రణాళిక మొత్తం పాక్లోనే జరిగిందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు కూడా పాక్ నుంచే వచ్చారని, అందుకే ఆధారాలు కూడా పాక్లోనే ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ఆయన బదులిచ్చారు.
పాకిస్తాన్ మారుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాలను చూసైనా ఉగ్రవాద నియంత్రణ విషయంలో కాస్త మారుతుందని ఆశించినవారికి తాను మారను గాక మారనంటూ పాక్ తెగెసి చెప్పడం విస్మయం గొలిపిస్తోంది. ట్రంప్ వ్యక్తిగతంగా ఎలాంటి వాడయినా ఉగ్రవాద చర్యలపై కఠిన వైఖరి అవలంబించడం తగినదేనని ఇప్పటికీ అనేక మంది బావిస్తున్నారంటే అందుకు పాక్ వంటి దేశాల వైఖరే కారణం.