దేవతలను ఆహ్వానిస్తూ రామార్చన : 5న మధ్యాహ్నం 12.30 గంటలకు (video)

మంగళవారం, 4 ఆగస్టు 2020 (12:06 IST)
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీంతో ఆలయ నిర్మాణం కోసం బుధవారం శంకుస్థాపన జరుగనుంది. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. దీంతో అయోధ్య నగరమంతా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. 
 
మరోవైపు, అయోధ్యలో వివిధ రకాల పూజలు మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయి. ఉదయం రామ‌జ‌న్మ‌భూమి ప్రాంతంలో రామార్చ‌న పూజ నిర్వ‌హించారు. భూమిపూజ వేడుక‌కు దేవ‌త‌ల‌ను ఆహ్వానిస్తూ రామార్చ‌న పూజ నిర్వ‌హించారు. 
 
హ‌నుమాన్‌గ‌ర్హి వ‌ద్ద కూడా మంగళవారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఉద‌యం 9 గంట‌ల ప్రాంతంలో హ‌నుమాన్‌గ‌ర్హి వ‌ద్ద నిషాన్ పూజ చేప‌ట్టారు. హ‌నుమాన్ గ‌ర్హి వ‌ద్ద నిషాన్ పూజ‌ను దాదాపు 1700 ఏళ్ల నుంచి నిర్వ‌హిస్తున్న సంప్ర‌దాయం ఉన్న‌ది. కాగా, రామాల‌య నిర్మాణం సంద‌ర్భంగా అయోధ్య‌లో వ‌రుస‌గా మూడు రోజుల పూజ‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇవాళ రెండ‌వ రోజు. 
 
రామ‌జ‌న్మ‌భూమిలో ఇవాళ వైదిక ప‌ద్ధ‌తిలో వాస్తు శాంతి, శిలాసంస్కృతి, న‌వ‌గ్ర‌హ పూజ‌లు కూడా నిర్వ‌హిస్తున్నారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12.30 నిమిషాల‌కు భూమిపూజ ప్రారంభంకానున్న‌ది. ఆ కార్య‌క్ర‌మం దాదాపు 10 నిమిషాలు ఉంటుంద‌ని పూజారులు చెప్పారు. 
 
భూమిపూజ కోసం అయోధ్య వ‌స్తున్న ప్ర‌ధాని నరేంద్ర మోడీ ఆ న‌గ‌రంలో సుమారు 3 గంట‌లపాటు గ‌డ‌ప‌నున్నారు. ప్ర‌ధాని మోడీ అయోధ్య‌లో పారిజాత మొక్క‌ను నాట‌నున్నారు. 48 హైటెక్ కెమెరాల‌తో భూమిపూజ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేయనున్నారు. ఇందులో డీడీ, ఏఎన్ఐ కెమెరాలు కూడా ఉన్నాయి.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు