బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ కేసు : ఉగ్రవాదికి ఉరిశిక్ష .. ఢిల్లీ కోర్టు తీర్పు

సోమవారం, 15 మార్చి 2021 (19:12 IST)
పుష్కరకాలం క్రితం దేశంలో సంచలనం సృష్టించిన కేసు బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్. ఈ కేసు ప్రధాన నిందితుడుగా ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన అరిజ్‌ ఖాన్‌ ఉన్నారు. అయితే, ఈ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పును వెలువరించగా, ఉగ్రవాది అరిజ్ ఖాన్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, రూ.11లక్షల జరిమానా కూడా విధించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, గత 2008లో ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్ళు సంభవించాయి. ఈ పేలుళ్ళ ఘటనలో 30 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. 
 
దేశ రాజధాని నగరంలోని కరోల్‌బాగ్‌, కన్నాట్‌ప్లేస్‌, గ్రేటర్‌ కైలాస్‌, ఇండియా గేట్‌ వద్ద బాంబు పేలుళ్లుకు తెగబడిన ఉగ్రవాదులు జామియా నగర్‌లోని ఎల్‌-18 బాట్లా హౌస్‌లో దాక్కున్నట్టు కేంద్ర నిఘా వర్గాలకు పోలీసులకు సమాచారం అందింది. 
 
దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసుల బృందం బాట్లా హౌస్‌కు చేరుకోగా, పోలీసులను చూడగానే తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌ చంద్‌ శర్మకు బుల్లెట్‌ తగలడంతో ఆయన వీరమరణం పొందారు. 
 
ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఆ సమయంలో అక్కడి నుంచి అరిజ్‌ ఖాన్‌, షాజాద్‌, జునైద్‌ తప్పించుకోగా.. మహ్మద్‌ సైఫ్‌ అనే మరో ముష్కరుడు పోలీసులకు లొంగిపోయాడు.
 
పరారైన వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. 2010లో షాజాద్‌ను యూపీలోని అజాంగఢ్‌లో అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడిపై రెండు ఛార్జిషీట్‌లు దాఖలు చేయగా.. మోహన్‌చంద్‌ శర్మను హత్యచేసిన ఘటనలో 2013లో అతడికి జీవిత ఖైదు పడింది. 
 
అదేసమయంలో 2018లో అరిజ్‌ఖాన్‌ను పోలీసులు భారత్‌ -నేపాల్‌ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఎన్‌కౌంటర్‌ కేసులో ఇటీవల అరిజ్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ న్యాయస్థానం అతడికి మరణదండన విధిస్తూ తీర్పు వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు