పాలల్లో మత్తు పదార్థం కలిపి... ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన తనయ

మంగళవారం, 20 ఆగస్టు 2019 (17:50 IST)
సాధారణంగా పిల్లలను చంపిన తల్లిదండ్రులను చూశాం. కానీ, ఇక్కడ కన్నతండ్రిని హత్య చేసిందో బాలిక. ఆ బాలిక వయసు 15 యేళ్లు మాత్రమే. పాల్లలో మత్తు పదార్థాలిచ్చి ఎవరికీ అనుమానం రాకుండా హత్య చేసింది. ఈ ఘటన బెంగుళూరు నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూరుకు చెందిన ఓ వస్త్ర వ్యాపారి(41)కి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే 15 ఏళ్ల వయసున్న బాలిక ఓ అబ్బాయితో చనువుగా ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి.. తన బిడ్డను మందలించాడు. ఆమెపై చేయి కూడా చేసుకున్నాడు. 
 
దీంతో తండ్రిపై కూతురు పగ పెంచుకుంది. ఆదివారం ఉదయం 10:30 గంటల సమయంలో తన ప్రియుడితో కలిసి తండ్రిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపింది. ఆ తర్వాత బాత్‌రూంలో పడేసి నిప్పు పెట్టి వారిద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఈ ఘటనలో వస్త్ర వ్యాపారి కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తన అమ్మ, సోదరుడు కలిసి పుదుచ్చేరికి పెళ్లికి వెళ్లారని.. ఈ క్రమంలో తాను అల్పాహారం తీసుకునేందుకు బంధువుల ఇంటికి వెళ్లాను అని చెప్పింది. ఏం జరిగిందో తనకు తెలియదు అని పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించింది. 
 
మొత్తానికి ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. దీంతో చేసిన నేరాన్ని అంగీకరించింది. తన తండ్రికి పాలల్లో మత్తు పదార్థాలు ఇచ్చిన తర్వాత ఆయన స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి కత్తితో పొడిచి చంపాను. అనంతరం డెడ్‌ బాడీని బాత్‌రూంలోకి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించామని పూసగుచ్చినట్టు వివరించింది. తనను మా నాన్న కొట్టినందుకే హత్య చేశానంటూ బోరున విలపిస్తూ చెప్పింది. దీంతో ఆమెతో పాటు.. ఆమె ప్రియుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు