ఇపుడు ముంబై సిటీ కంటే.. జైలే ఉత్తమం : నిందితుడికి బెయిల్ నిరాకరించిన జడ్జి

గురువారం, 9 ఏప్రియల్ 2020 (20:27 IST)
ప్రస్తుత పరిస్థితుల్లో బయట ఉండటం కంటే.. జైల్లో ఉండటమే ఉత్తమమంటూ ఓ నిందితుడి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు జడ్జి నిరాకరించారు. ఈ ఘటన బాంబేలో జరిగింది. ఈ వివరాలను స్పందిస్తే, ముంబైలోని సబర్బన్‌ ఘట్కోపర్‌ ఏరియాకు చెందిన జితేంద్ర మిశ్రా ఓ హత్య కేసులో జైలు పాలయ్యాడు. నవీ ముంబైలోని తలోజా జైలులో గత 18 నెలల నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు.
 
అయితే నిందితుడు మిశ్రా తాత్కాలిక బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ జీఎస్‌ పటేల్‌ గురువారం విచారించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై సిటీ కంటే జైలే ఉత్తమం అని నిందితుడికి జడ్జి సూచించారు. 
 
బయట కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉందని, జైల్లోనే క్షేమంగా ఉండాలని నిందితుడికి జడ్జి చెప్పారు. ముంబై సిటీలో ఏం జరుగుతోందో నీకు తెలియనట్లు ఉందని నిందితుడిని ఉద్దేశించి జీఎస్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు. బయటి కంటే జైల్లోనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. 
 
సాధ్యమైన చోట ఖైదీలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి తెలుసునని, అయితే నగరంలోని పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని బాంబే హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.
 
ప్రస్తుతం ముంబైలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నిందితుడిని విడుదల చేయడానికి కుదరదు అని కోర్టు తెలిపింది. ముంబైలోని అనేక ప్రాంతాలు కరోనా వైరస్ వ్యాప్తికి హాట్ స్పాట్లుగా మారాయని పేర్కొంది. ఇప్పుడు మిశ్రాను విడుదల చేస్తే కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు