ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తగలబడిన రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలు!

మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (15:42 IST)
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూఢిల్లీ - భువనేశ్వర్‌ల మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ బోగీలు తగలబడ్డాయి. ఢిల్లీ స్టేషన్‌లో రైలు ఆగివుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో రైలు బోగీల్లో ప్రయాణికులెవ్వరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో రైల్వే స్టేషన్ మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. 
 
ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు పక్కనున్న సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు వ్యాపించాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుంది. 16 ఫైరింజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ రైలుని వాషింగ్ ఏరియాలో పార్కింగ్ చేసినప్పుడు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. రైల్వే స్టేషన్‌లో రైలు ఆగి ఉన్న సమయంలో మంటలు వ్యాపించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి