కమనాథులపై ఆర్ఎస్ఎస్ కన్నెర్ర... అందుకే ముఫ్తీతో బంధానికి కటీఫ్

బుధవారం, 20 జూన్ 2018 (08:52 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని హిందువుల్లో భారతీయ జనతా పార్టీ పట్టుకోల్పోతుందని, ఇది భవిష్యత్‌లో మరింత ఇబ్బందులకు దారితీస్తుందని ఆర్ఎస్ఎస్ నేతలు భావించారు. ఇదే విషయంపై కమలనాథులకు ఆర్ఎస్ఎస్ అధిష్టానం గట్టిగావార్నింగ్ ఇచ్చిందట. దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లోభాగంగా తొలుత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సర్కారుకు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంది.
 
ఇటీవల హర్యానా రాష్ట్రంలోని సూరజ్‌కుండ్‌లో బీజేపీ, ఆరెస్సెస్ ముఖ్య నేతల భేటీ జరిగింది. ఇందులో ప్రతి రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు దేశరాజకీయ పరిస్థితులపై చర్చ జరిగింది. ముఖ్యంగా, జమ్మూకాశ్మీర్‌లోని పరిస్థితులపై చర్చ జరిగింది. వచ్చే ఎన్నికల్లో పీడీపీతో కలిసి వెళ్తే బీజేపీ తీవ్రంగా దెబ్బతింటుందని, గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావని నేతలు అభిప్రాయపడ్డారు. 
 
ముఖ్యంగా, పీడీపీతో పొత్తు వల్ల జమ్మూకాశ్మీర్‌లోని హిందువుల్లో బీజేపీ పట్టు కోల్పోతోందని, మున్ముందు ఇది బీజేపీకి ఎదురుదెబ్బ కాగలదని ఆరెస్సెస్ భావించింది. ఈ విషయాలను బీజేపీ అధిష్టానానికి తేల్చి చెప్పింది. ఇందులోభాగంగా, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఫలితంగా పీడీపీతో కటీఫ్ చెప్పినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, రాష్ట్ర రాజకీయాల్లో పీడీపీ ఆధిపత్య ధోరణి కూడా ఇందుకు మరో కారణంగా తెలుస్తోంది. గవర్నర్ పాలన ద్వారా రాష్ట్రంపై పూర్తి పట్టు సాధించవచ్చనేది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోంది. పాలనపై పూర్తి అధికారం ఉంటే రాష్ట్రంలో చెలరేగిపోతున్న ఉగ్రవాదులు, వేర్పాటువాదుల పీచమణచవచ్చని భావిస్తోంది. ఈ కారణంగానే పీడీపీ నుంచి బీజేపీ బయటకు వచ్చినట్టు పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు