విదేశీ వుద్యోగమని వెళ్లాడు, సింగిల్ కిడ్నీతో తిరిగొచ్చాడు... ఏమైందంటే?

గురువారం, 23 నవంబరు 2017 (14:52 IST)
నిరుద్యోగులు, ఆర్థికంగా దెబ్బతిని ఇబ్బందులు పడేవారిని లక్ష్యం చేసుకుంటూ జరిగే నేరాలలో కిడ్నీ రాకెట్ ఒకటి. తాజాగా ఓ వ్యక్తి కైరో దేశంలో ఉద్యోగం యిప్పిస్తామని చెబితే నమ్మి వెళ్లినందుకు అక్కడ అతడి కిడ్నీని తీసుకుని మళ్లీ తిరిగి స్వదేశానికి పంపారు. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని వేలూర్‌కు చెందిన 29 ఏళ్ల అహ్మద్ బాషా డ్రైవరుగా వున్నాడు. ఐతే తన భార్య ప్రమాదానికి గురవడంతో ఆమెకు చికిత్స చేయించేందుకు చాలినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితుల వద్ద రూ.7 లక్షలు అప్పు చేశాడు. 
 
ఆ అప్పుకు వడ్డీ పెరిగి కొండలా మారుతుండటంతో ఇక ఇక్కడ లాభం లేదనుకుని ముంబై వెళ్లి అక్కడ కారు డ్రైవరుగా చేరాడు. కానీ అక్కడ కూడా అతడికి వచ్చే డబ్బు సరిపోక పోవడంతో విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశాడు. ఆ క్రమంలో అతడికి ఓ ప్రకటన కనిపించింది. కైరోలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ అందులో వున్నది. వెంటనే అతడు సదరు వ్యక్తిని సంప్రదించాడు. వారు అహ్మదాబాదుకు రావాల్సిందిగా చెప్పారు. 
 
బాషా అహ్మదాబాదుకు చేరుకోగానే అక్కడ ప్రజాపతి అనే వ్యక్తి ఇతడి కోసం కాచుకుని కూర్చుని వున్నాడు. వెళ్లగానే రక్త నమూనాలు సేకరించారు. బాషాకు అనుమానం వచ్చి... తన రక్త నమూనాలు ఎందుకు సేకరిస్తున్నారని అడుగ్గా... విదేశాల్లో ఉద్యోగం అంటే ఇవన్నీ తప్పవని నమ్మించారు. ఆ తదుపరి అతడిని కైరో పంపారు. కైరోకు వెళ్లగానే ఇతడిని మధు అనే వ్యక్తి ఓ అపార్టుమెంటుకు తీసుకెళ్లాడు. 
 
మరుసటి రోజు అతడిని నైల్ బద్రవి ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ పథకం ప్రకారం కిడ్నీని తీసేసుకున్నారు. ఆ తర్వాత కొన్నిరోజులకు మళ్లీ ఇండియా పంపారు. కానీ అక్కడి నుంచి తిరిగొచ్చిన బాషా, స్నేహితుల వద్ద తీసుకున్న అప్పు తీర్చలేకపోయాడు సరికదా... కారు డ్రైవర్ ఉద్యోగం సైతం కోల్పోయాడు. చివరికి రిక్షా లాగుతూ బతుకుబండి ఈడుస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు