'మిస్ యూ ఆల్ .. లవ్ యూ ఆల్' : చెన్నైలో తెలుగు విద్యార్థిని సూసైడ్

గురువారం, 23 నవంబరు 2017 (08:56 IST)
చెన్నై సత్యభామ విశ్వవిద్యాలయంలో తెలుగమ్మాయి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన తోటివిద్యార్థులు హాస్టల్‌కు నిప్పుపెట్టారు. బుధవారం రాత్రి జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై నగరంలోని డీమ్స్ వర్శిటీల్లో సత్యభామ యూనివర్శిటీ ఒకటి. ఈ వర్శిటీలో ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ కోవలో హైదరాబాద్‌కు చెందిన రాధ మౌనిక అనే విద్యార్థిని కంప్యూటర్ ఇంజినీరింగ్‌‌లో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ విద్యార్థిని హాస్టల్‌లో తన గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. ఇది తీవ్ర సంచలనం సృష్టించింది. 
 
రెండు రోజుల కిందట కళాశాలలో జరిగిన ఇంటర్నల్ ఎగ్జామ్‌లో కాపీ కొట్టిందని మౌనికను ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపించి వేశారు. తదుపరి పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక.. ‘మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్’ అని స్నేహితులకు మెసేజ్ పెట్టి హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హృదయ విదారకమైన ఈ సంఘటన తోటి విద్యార్థులచే కంటతడి పెట్టించింది. 
 
రాధా మౌనిక ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్ధుల విధ్వంసానికి పాల్పడ్డారు. హాస్టల్, తరగతి గదులలోని ఫర్నిచర్‌తో పాటు బస్సులు, ఇతర వాహనాలకు విద్యార్థులు నిప్పుపెట్టారు. తమ స్నేహితురాలి మృతికి యాజమాన్యమే కారణమంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. వర్సిటీ ప్రాంగణంలో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి కాలేజీ యాజమాన్యం సమాచారం అందించింది. 
 
వర్సిటీకి చేరుకున్న పైర్ ఇంజన్లను విద్యార్థులు లోపలికి రానివ్వకుండా అడ్డుకునే యత్నం చేశారు. వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని లోనికి వెళ్లనిచ్చి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఇదిలావుండగా ఎంతో బ్రిలియంట్ స్టూడెంట్ అయిన రాధ మౌనిక కాపీ కొట్టే అవకాశమే లేదని, ఒక బ్రిలియంట్ స్టుడెంట్‌ను అవమానించి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు