మగాళ్లను అలా పిలుస్తున్నారా.. అయితే దావా వేయండి : బాంబే హైకోర్టు

సోమవారం, 12 నవంబరు 2018 (10:21 IST)
బాంబే హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. పురుషులను 'నపుంసకుడు' అని పిలిస్తే వారి పరువుకు నష్టం కలిగించినట్లేనని, ఈ పదం మగవాళ్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని వ్యాఖ్యానించింది. పైగా, ఇలాంటి పదాలను ఉపయోగించి మగాళ్లను పిలిస్తే పరువు నష్టం దావా వేయొచ్చని తెలిపింది. ఓ విడాకుల కేసులో బాంబే హైకోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. 
 
నాగ్‌పూర్‌కు చెందిన దంపతుల మధ్య గత 2016లో మనస్పర్థలు తలెత్తాయి. దీంతో విడాకులు కోరుతూ సదరు మహిళ తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే వారి కుమార్తె సంరక్షణ బాధ్యతలను కోర్టు తాత్కాలికంగా భర్తకే అప్పగించింది. 
 
ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆమె బొంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పుర్‌ ధర్మాసనంలో పిటిషన్ వేశారు. తన భర్త నపుంసకుడని పిటిషన్‌లో ఆమె ఆరోపించారు. దీంతో ఆమెతోపాటు ఆమె బంధువులపైనా భర్త పరువు నష్టం కేసు వేశారు. దీన్ని కొట్టివేయాలని ఆమె నాగ్‌పుర్‌ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. 
 
'అగౌరవ పరిచాలనే ఉద్దేశంతో ఆ పదాన్ని ఉపయోగించలేదు. మా పాప కూడా అధునాతన సంతాన చికిత్స ద్వారా జన్మించింది' అని అభ్యర్థనలో ఆమె వివరించారు. ఈ అభ్యర్థనపై జస్టిస్‌ సునిల్‌ శుక్రే విచారణ చేపట్టారు. వైద్య స్థితిని తెలియజేసేందుకే ఆ పదాన్ని ఉపయోగించినప్పటికీ.. దాంతో జరిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకోలేకుండా ఉండలేమని పేర్కొంటూ ఇలాంటి పదాలను ఉపయోగించే వారు పరువునష్టం దావా కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు