నేను రైతు పక్షపాతిని.. రైతు వ్యతిరేకిని కాదు : బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్

ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (19:29 IST)
తాను రైతు పక్షపాతినని, రైతు వ్యతిరేకిని కాదని బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి గెలిచి అధికారంలోకి వస్తే రెండేళ్ళలోనే దేశం వెలిగిపోయేలా చేస్తామన్నారు. తెలంగాణ పథకాలు కావాలంటే బీఆర్ఎస్‌ను అందించాలని ఆయన కోరారు. 
 
తాను ఎవరికీ వ్యతిరేకిని కాదన్నారు. రైతు పక్షిపాతినని చెప్పారు. మహారాష్ట్రలోనూ తెలంగాణ పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్‌ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా దళిత బంధును అమలు చేస్తామని చెప్పారు. ఎలాంటి వనరులు లేని సింగపూర్, మలేషియా వంటి దేశాలు అద్భుతాలు చేస్తుంటే భారత్ మాత్రం ఎక్కడిదక్కడే ఉందని అన్నారు. 
 
దేశంలో అపార సంపద ఉన్నా అది జనానికి ఉపయోగపడటం లేదన్నారు. నాలుగు దశాబ్దాలు దాటిన ట్రైబ్యునల్లు దేశంలోని జల వివాదాలను ఎందుకు పరిష్కరించడం లేదని చెప్పారు. దేశంలో ఎందుకు జల యుద్ధాలు జరుగుతున్నాయి అని ప్రశ్నించారు. మహానది, గోదావరి, కావేరి నీళ్ల కోసం పంచాయితీలు ఎందుకు, రాష్ట్రాల మధ్య ఎందుకు నీటి చిచ్చు పెడుతున్నారు అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. 
 
కేంద్ర పాలకులకు చిత్తశుద్ధి వుంటే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చన్నారు. కానీ, విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రం యత్నిస్తుందని ఆరోపించారు. అదానీ, అంబానీ, జిందాల్‌లకు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. పవర్ సెక్టార్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే దేశాన్నే బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి వస్తుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. అలాగే, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు