మన్మోహన్‌ హస్తం లేదని భావించారా? లేదా? : సీబీఐకు ప్రశ్నించిన కోర్టు!

మంగళవారం, 25 నవంబరు 2014 (17:08 IST)
కోల్‌గేట్ స్కామ్‌లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్, అప్పటి బొగ్గు మంత్రికి సంబంధం ఉన్నట్టు భావించలేదా అని సీబీఐను ఢిల్లీ ప్రత్యేక కోర్టు ప్రశ్నించింది. దీంతో ఏమాత్రం తడుముకోని సీబీఐ... ఈ కేసులో పీఎంవో అధికారిని ప్రశ్నించాం. దాంతో బొగ్గు శాఖ మంత్రిని విచారించాల్సిన అవసరం ఏముందనుకున్నాం. అయినా ప్రశ్నించేందుకు అప్పుడు అనుమతి లేదు అని మన్మోహన్ పేరు పేర్కొనకుండా కోర్టు జడ్జికి తెలిపింది.
 
కాగా, ఈ కేసులో ఇతర పత్రాలతో పాటు ఈ కేసు డైరీని తమకు సమర్పించాలని కోర్టు కోరగా, సీల్డు కవర్‌లో ఇస్తామని సీబీఐ తెలిపింది. యూపీఏ-2 హయాంలో చోటుచేసుకున్న ఈ స్కాంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బొగ్గు మంత్రిత్వ శాఖను ప్రత్యక్షంగా పర్యవేక్షించేవారు. 
 
ఈ సమయంలో పారిశ్రామికవేత్త, ఆదిత్యా బిర్లా గ్రూపు ఛైర్మన్ కుమార మంగళం బిర్లాకు హిందాల్కో బొగ్గు క్షేత్రాన్ని కేటాయించారు. ఈ కేసు తాజా విచారణలోనే కోర్టు పైవిధంగా అడిగింది. ప్రధానంగా పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లాకు 2005లో కేటాయించిన బొగ్గు నిక్షేపాల స్కామ్‌లో మాజీ ప్రధానిని ఎందుకు విచారించలేదని అత్యున్నత విచారణ సంస్థను ఢిల్లీ ప్రత్యేక కోర్టు ప్రశ్నించింది. 
 
కాగా, ఆ సమయంలో బొగ్గు మంత్రిత్వశాఖను ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ పర్యవేక్షించారు. అయితే అప్పటి ప్రధాని అని సంబోధించిన న్యాయమూర్తి అతని పేరును ప్రస్తావించలేదు. ‘మీకు బొగ్గుశాఖ మంత్రిని విచారించాల్సిన అవసరం లేదని అనిపించిందా? లేక ఆ మంత్రిని విచారించేందుకు అనుమతి లేదా?' అని కోర్టు సిబిఐని ప్రశ్నించింది. పారదర్శకంగా లేకుండా బొగ్గు గనుల కేటాయింపు కారణంగా ప్రభుత్వం కోట్లాది రూపాయల ధనం కోల్పోయిందనే ఆరోపణలున్నాయి. 
 
ఆగస్టులో ఈ కుంభకోణంపై విచారించిన కోర్టు.. సుమారు 200 కోల్ బ్లాక్ కేటాయింపులను రద్దు చేసేందుకు అంగీకరించింది. దీంతో ప్రస్తుత ప్రభుత్వం ఆ బొగ్గు క్షేత్రాలకు వేలం వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 2005లో జరిగిన బొగ్గు కుంభకోణంలో విచారణ జరిపిన సిబిఐ ఇటీవల తన ఛార్జీ షీటులో కుమార మంగళం బిర్లాను, హిందాల్కోలను చేర్చడం చర్చనీయాంశమైంది. బిర్లాతో పాటు మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి పిసి పరేఖ్‌లపై 2012లో సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా, తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని హిందాల్కో తేల్చి చెప్పింది. 

వెబ్దునియా పై చదవండి