భర్త నెలరోజుల పాటు భార్య ఇంటికి ఇల్లరికం వెళ్లాలి

మంగళవారం, 1 మార్చి 2022 (09:21 IST)
మనస్పర్థల కారణంగా విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలిపేందుకు గ్వాలియర్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. భర్త నుంచి వేరుగా ఉంటున్న భార్య పిటిషన్‌పై విచారణ చేపట్టి సంచలన తీర్పు ఇచ్చింది. 
 
భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు భర్త నెలరోజుల పాటు భార్య ఇంటికి ఇల్లరికం వెళ్లాలని ఆదేశించింది. అయినప్పటికీ తీరు మారకపోతే తర్వాత ఆలోచిస్తామని వెల్లడించింది. ఈ తీర్పు ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారింది.
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని సేవానగర్‌కు చెందిన గీతా రజక్, మొరాదా కు చెందిన గణేశ్‌కు వివాహమైంది. వీరికి ఒక కుమారుడు సంతానం. కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి దాంపత్యంలో ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో వీరిద్దరి ఘర్షణలు నిత్యకృత్యమయ్యాయి. 
 
ఈ క్రమంలో గీత తన భర్తను వదిలి వెళ్లిపోయింది. అయితే తమ బిడ్డను ఇచ్చేందుకు గణేశ్ నిరాకరించాడు. కుమారుడు తన వద్దే పెరుగుతాడని తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన గీత గ్వాలియర్ హైకోర్టును ఆశ్రయించింది. తన బిడ్డను తన దగ్గరకు చేర్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
 
ఇరువురి వాదనలు విన్న కోర్టు.. ఒక విచిత్రమైన తీర్పు వెల్లడించింది. గణేశ్ ఒక నెల రోజుల పాటు భార్య ఇంటికి ఇల్లరికం వెళ్లాలని తీర్పునిచ్చింది. అదే విధంగా అల్లుడిని బాగా చూసుకోవాలని గీతా కుటుంబసభ్యులకు సూచించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు