480 మంది చర్చి ఫాదర్లపై కేసు.. ఎందుకంటే..?

గురువారం, 6 మే 2021 (17:17 IST)
ఒకరిద్దరిపై కాకుండా.. ఏకంగా 480 మంది చర్చి ఫాదర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా(సీఎస్ఐ)లో గత నెలలో చర్చి ఫాదర్ల వార్షిక సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కరోనా వ్యాప్తికి కారణమైనందుకు ఫాదర్లపై కేసు నమోదు చేశారు.
 
ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశానికి ఆయా ప్రాంతాల నుంచి 480 మంది ఫాదర్లు హాజరయ్యారు. ఈ సమావేశాలు ముగిసిన కొద్ది రోజులకు సుమారు 100 మందికి పైగా ఫాదర్లు కరోనా బారిన పడ్డారు. ఇద్దరు ఫాదర్లు మరణించారు.
 
దీంతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి చర్చి ఫాదర్లు సమావేశం నిర్వహించారని, ఆ సమయంలోనే కరోనా వ్యాప్తి చెందిందని అధికారులు భావించారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
ఇక కరోనా బారిన పడ్డ ఫాదర్లు చర్చి ఆధ్వర్యంలో నడుస్తోన్న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కొందరేమో హోం ఐసోలేషన్‌కే పరిమితం అయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు