నోరెందుకు పారేసుకుంటావని ప్రశ్నించిందుకు ఓ దళితుడి తల తెగ్గోశాడో ఉపాధ్యాయుడు. సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కదారియా అనే గ్రామంలో కుందన్ కుమార్ సింగ్కు చెందిన పిండిమిల్లు వద్దకు గోధుమ పిండి పట్టించుకునేందుకు సోహన్ రామ్ అనే దళిత వ్యక్తి వెళ్లాడు.
ఇదేసమయంలో ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేసే లలిత్ కర్నాటక్ అనే వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. దళితుడైన సోహన్ పిండి ఆడించుకునేందుకు అక్కడికి రావడం వల్ల ఆ ప్రదేశం మొత్తం అపవిత్రమైందని, కులం తక్కువవాడిని ఎందుకు రానిస్తారంటూ పరుష పదజాలంతో దూషించాడు.
దీంతో, అవమానానికి గురైన సోహన్ 'ఎందుకలా నోరు పారేసుకుంటారు?' అని ప్రశ్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన లలిత్... 'నన్నే ప్రశ్నిస్తావా?' అంటూ అక్కడే ఉన్న పెద్ద కొడవలితో అతని మెడపై ఒక్క వేటు వేశాడు. అంతటితో ఆగని లలిత్... అదే ఆవేశంతో... సోహన్ తలను మొండెం నుంచి వేరు చేశాడు. దీంతో ఆ గ్రామంలో దళితులు ఆందోళన చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతనిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.