దేశంలో తగ్గిన కరోనా మరణాలు

శుక్రవారం, 16 జులై 2021 (09:55 IST)
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు తగ్గగా.. మరణాలు సుమారు 100 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి.గురువారం 19,55,910 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..38,949 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

ముందురోజుతో పోల్చితే కేసుల్లో 6.8 శాతం తగ్గుదల నమోదైంది. 24 గంటల వ్యవధిలో మరో 542 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3 కోట్ల 10లక్షలకు చేరగా.. 4,12,531 మంది మృత్యుఒడికి చేరుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో నమోదవుతోన్న కేసుల్లో సగానికి పైగా కేరళ, మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. కేరళలో కొత్తగా 13 వేల మందికి కరోనా సోకగా.. మహారాష్ట్రలో 8వేల మంది వైరస్ బారినపడ్డారు.
 
దేశవ్యాప్తంగా నిన్న 40వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.28 శాతానికి చేరగా.. క్రియాశీల రేటు 1.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 4,30,422 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు.

మొత్తంగా 3.01కోట్ల మందికిపైగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న 38.78 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 39.53 కోట్లుగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు