మానవత్వమా నీవెక్కడ :: వైద్యం అందక.. తండ్రి భుజాలపైనే ప్రాణాలొదిలిన బిడ్డ

మంగళవారం, 30 ఆగస్టు 2016 (13:05 IST)
ప్రస్తుత సమాజంలోని మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ పరిస్థితి కేవలం నిరక్షరాస్యుల్లోనే కాదు.. విద్యావంతుల్లో కూడా కనిపిస్తోంది. మొన్నటికిమొన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోయిన భార్య శవాన్ని ఇంటికి తరలించేందుకు ఆంబులెన్స్ ఇచ్చేందుకు ఆస్పత్రి అధికారులు నిరాకరించారు. దీంతో భార్య శవాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్లు నడిచిన ఘటన దేశం ప్రజలనే కాదు.. ఇతర దేశం అధ్యక్షుడిని సైతం కదిలించింది.
 
ఈ ఘటన సద్దుమణగక ముందే... ఒడిషా రాష్ట్రంలో మరోఘటన వెలుగులోకి వచ్చింది. సుస్తి చేసిన భార్యకు పెద్దాసుపత్రిలో వైద్యం చేయించేందుకు బస్సులో తీసుకెళుతుండగా, ఆ భార్య బస్సులోనే ప్రాణాలు విడిచింది. ఈ విషయం గమనించిన బస్సు డ్రైవర్, కండక్టర్.. మృతదేహాన్ని, ఐదు రోజుల పసికందును, మృతురాలి అత్త, భర్తను జోరు వర్షం పడుతున్నా అడవిలో బలవంతంగా దించి వెళ్లిపోయిన ఘటన తెల్సిందే. ఇది తీవ్ర విమర్శలకు దారితీయగా, డ్రైవర్, కండక్టర్‌ను అరెస్టు చేసి, బస్సును సీజ్ చేశారు. 
 
తాజాగా, ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో జరిగింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ బిడ్డకు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు వైద్యం చేసేందుకు నిరాకరించడంతో ఆ బాలుడు తండ్రి భుజాలపైనే తుదిశ్వాస విడిచాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కాన్పూర్‌కు చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి కుమారుడు అంశ్ (12) అనే బాలుడు గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడున్నాడు. దీంతో వైద్యం చేయించేందుకు కాన్పూర్‌‌లోని లాలా లజపతిరాయ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యవసర సేవల చికిత్సా విభాగంలో చేర్చి వైద్యం  అందించాలని ఆస్పత్రి వైద్యులను సునీల్ కుమార్ కోరాడు. 
 
ఆయన మాటలు ఏమాత్రం పట్టించుకోలేదు కదా... జ్వరంతో బాధపడుతున్న బిడ్డను కనీసం చేయిపట్టుకుని కూడా చూడలేదు. పైగా, అక్కడి నుంచి పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. దీంతో పిల్లల ఆస్పత్రి దూరంగా ఉండటంతో ఆంబులెన్స్ సమకూర్చాలని కోరారు. దీనికి వైద్యులు నిరాకరించారు. ఎంత ప్రాధేయపడినా వైద్యులు కనికరించకపోవడంతో జ్వరంతో బాధపడుతున్న బిడ్డను భుజంపై వేసుకుని పరుగుపరుగున చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లాడు. 
 
అయితే, ఆ బిడ్డ మార్గమధ్యంలోనే తండ్రి భుజంపైనే ప్రాణాలు విడిచాడు. దీంతో బిడ్డ మృతదేహాన్ని భుజం మీద వేసుకుని నడుచుకుంటూనే ఇంటికి వెళ్లానని సునీల్ బోరున విలపిస్తూ చెప్పాడు. ఒక్క అర్థగంట ముందు చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించివుంటే నా బిడ్డ బతికివుండేవాడని ఆ తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు. 

వెబ్దునియా పై చదవండి