గుర్మీత్ రామ్ సింగ్ సమాజానికి చీడపురుగు లాంటివాడు: అన్షుల్ ఛత్రపతి

సోమవారం, 28 ఆగస్టు 2017 (19:26 IST)
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ సమాజానికి చీడపురుగు లాంటివాడని గుర్మీత్ రేప్ కేసును వెలుగులోకి తెచ్చి హత్యకు గురైన సిర్సా జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి తనయుడు అన్షుల్ ఛత్రపతి అన్నారు. సమాజానికి శత్రువులాంటి వాడైన గుర్మీత్.. ఎంతోమంది జీవితాలతో ఆటాడుకున్నాడని కామెంట్ చేశారు. గుర్మీత్ సింగ్‌కు న్యాయస్థానం సరైన శిక్ష విధించిందని చెప్పారు. 
 
కాగా రామ్ చందర్ ఛత్రపతి హత్యపై సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేస్తూ 2005 జనవరిలో పంజాబ్, హర్యానా హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసులో వాదనలు సెప్టెంబర్ 16న జరగనున్నాయి. ఇకపోతే గుర్మీత్ దారుణాలను వెలుగులోకి తెచ్చినందుకు 2002 అక్టోబర్ 24న రామ్ చందర్ ఛత్రపతిని కొందరు దుండగులు కాల్చిచంపేశారు. 
 
ఆ తర్వాతనే గుర్మీత్ చేసిన లైంగిక వేధింపులపై కేసు నమోదు చేసుకుని.. విచారణ చేపట్టాలని 10 నవంబర్ 2003లో హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఆపై రంగంలోకి దిగిన కోర్టు సీబీఐ సాక్ష్యాలను అందజేసి.. గుర్మీత్‌ను నిందితునిగా తేల్చింది. ఇక గుర్మీత్‌కు ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం పదేళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించింది.

వెబ్దునియా పై చదవండి