రైతులకు సంఘీభావం తెలిపిన వైద్యులు.. ఛలో ఢిల్లీ మరింత ఉధృతం

గురువారం, 3 డిశెంబరు 2020 (17:10 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగారు. ఈ రైతులంతా తలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఢిల్లీ పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. అయినప్పటికీ రైతులు సరిహద్దుల్లోనే తిష్టవేసి, ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. వీరికి వైద్యులు మద్దతు ప్రకటించారు. 
 
గత ఆరు రోజులుగా ఆందోళన చేస్తూ అస్వస్థతకు లోనైన రైతులకు స్వచ్చంధంగా వైద్యం చేస్తున్నారు. ఇందుకోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సఫ్దార్‌జంగ్, హిందూ రావ్ ఆస్పత్రులకు చెందిన వైద్యలతో పాటు మరెంతో మంది ఢిల్లీ వైద్యులు ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ వైద్యులకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ముఖ్యంగా, రాత్రి, పగలు తేడా లేకుండా నిద్ర మానుకుని నిరసన చేస్తున్న రైతుల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇలాంటివారికి వైద్యులు మెడికల్స్ క్యాంప్స్ ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ, ఉచితంగా మందులు అందిస్తున్నారు. ప్రొటెస్ట్ జరుగుతున్న 5 సిటీల్లోనూ మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫార్మర్ ప్రెసిడెంట్ తెలిపాడు.
 
రైతులకు తమ సంఘీభావం తెలియజేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. కాగా డాక్టర్లు చేస్తున్న సాయానికి నెటిజన్లు అభినందిస్తున్నారు. 'మానవత్వం ఇంకా బతికే ఉంది. గ్రేట్ వర్క్ గో హెడ్ డాక్టర్స్, మీరు చేస్తున్న ఈ సేవలు ఎంతో అభనందనీయం.. డాక్టర్లందరికీ అభినందనలు' అని కామెంట్స్ చేస్తున్న విషయం తెల్సిందే. 
 
కాగా, ఈ కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయంటూ లక్షలాది మంది రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులకు కదిలివచ్చి పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. వీరి ఆందోళన గురువారానికి ఆరో రోజుకు చేరింది. కాగా, వారు ఎక్కడ కూడా హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. కానీ వారిని ఢిల్లీ వెళ్లనీయకుండా వాటర్ క్యాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించి అడ్డుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో ఎంతోమంది రైతులు గాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు