2024 సార్వత్రిక సమరానికి సిద్ధమవుతున్న ఎన్నికల సంఘం

బుధవారం, 10 మే 2023 (10:05 IST)
భారత ఎన్నికల సంఘం మినీ సార్వత్రిక సమరానికి సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా మొత్తం తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రెఢీ అవుతుంది. ఉమ్మడి ఎన్నికల గుర్తుల కోసం పార్టీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్‌ అండ్‌ అలాట్‌మెంట్‌) ఆర్డర్‌ 1968లోని పేరా 10-బిని అనుసరించి 2023-24 సంవత్సరాల్లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ఉమ్మడి గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
 
ఈసీ జారీ చేసిన ఆదేశాల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు జులై 17 తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు డిసెంబరు 12 తర్వాత, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు డిసెంబరు 17 తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 
 
వచ్చే ఏడాది కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. 
 
తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో, ఏపీ అసెంబ్లీ గడువు 2024 జూన్‌ 11తో, లోక్‌సభ గడువు 2024 జూన్‌ 16తో ముగియనున్నట్లు  వెల్లడించింది. ఒకవేళ ఏదైనా అసెంబ్లీ గడువు తేదీ కంటే ముందే రద్దయితే, ఆ రోజు నుంచి నోటిఫికేషన్‌ జారీ చేసే నాటికి అయిదురోజుల ముందు వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు