సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరాహార దీక్ష ప్రారంభం

సోమవారం, 14 డిశెంబరు 2020 (10:42 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని దేశంలో ఉన్న అందరు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఒక్క డిమాండ్‌పై రైతులు ఛలో ఢిల్లీ పేరుతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన 18వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. దీంతో రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఆందోళనలో భాగంగా రైతులు నేడు నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన నిరశన దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 
 
ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని ఘజీపూర్ రహదారిపై కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ దీక్షకు కూర్చోగా, హర్యానా సరిహద్దులోని సింఘు, టిక్రీ వద్ద రైతులు పెద్ద ఎత్తున దీక్షలో కూర్చున్నారు. రైతు నాయకుల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఢిల్లీ సహా అన్ని జిల్లా జిల్లా కేంద్రాల్లోనూ రైతులు దీక్షకు దిగారు. 
 
రైతుల ఆందోళన నేపథ్యంలో హర్యానా - రాజస్థాన్ సరిహద్దును పోలీసులు మూసివేశారు. రైతులు ఢిల్లీలో ప్రవేశించకుండా భారీగా బలగాలను మోహరించారు. కాగా, ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా దేశ రాజధానిలో తాను కూడా దీక్షలో పాల్గొననున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. 
 
మరోవైపు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, కొత్త వ్యవసాయ చట్టాలకు కొన్ని రైతు సంఘాలు మద్దతిస్తున్నాయని తెలిపారు. ఉత్తరాఖండ్ రైతులు తనను కలిసి కొత్త చట్టాలకు మద్దతు తెలిపారని వివరించారు. కొత్త చట్టాలను అర్థం చేసుకున్న ఉత్తరాఖండ్ రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సాగు చట్టాలకు మద్దతిచ్చే సంఘాలకు, నేతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తోమర్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు