డీజీపీ ఉద్యోగానికి రాజీనామా.. రైతులకు మద్దతు తెలిపిన పంజాబ్ అధికారి!

ఆదివారం, 13 డిశెంబరు 2020 (15:43 IST)
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఛలో ఢిల్లీ పేరుతో చేపట్టిన ఈ ఆందోళనలు గత 18 రోజులుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా నిలిచేందుకు పంజాబ్ పోలీసు అధికారి ఒకరు తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. 
 
పంజాబ్‌ జైళ్ల శాఖ డీఐజీ అయిన లక్మీందర్ సింగ్ జఖర్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను హోం శాఖ కార్యదర్శికి పంపించారు. రాజీనామా చేసిన విషయాన్ని ఏడీజీపీ (జైలు) పీకే సిన్హా ధ్రువీకరించారు. 
 
కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో దేశంలోని రైతులు కలత చెందుతున్నారని, వారికి బాసటగా నిలిచేందుకు డీఐజీ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు తన రాజీనామా లేఖలో లక్మీందర్ తెలిపారు. 
 
'నేను ఒక రైతు కొడుకును, రైతుల ఉద్యమంలో భాగం కావాలనుకుంటున్నాను. అందుకే డీఐజీ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఢిల్లీ వెళ్లి రైతు సోదరులతో హక్కుల కోసం పోరాడటానికి వీలుగా వెంటనే విధుల నుంచి విడుదల చేయండి' అని తన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. 
 
కాగా, తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించని పక్షంలో సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని రైతులు హెచ్చరించిన విషయం తెల్సిందే. అంతేకాకుండా, ఢిల్లీకి వచ్చే జాతీయ రహదారులను దిగ్బంధించాలని రైతులు పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొనివున్నాయి. 
 
మరోవైపు, ఉద్యమానికి మద్దతుగా రాజస్థాన్‌కు చెందిన వేల సంఖ్యలో రైతులు ఆదివారం ఢిల్లీకి వస్తున్నారని రైతు నాయకుడు కమల్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ సమయంలో వారు ఢిల్లీ - జైపూర్ రహదారిని పోలీసులు అడ్డుకోనున్నారు. 
 
మా ఉద్యమాన్ని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక వ్యూహాలను అవలంభిస్తున్నదని, అయితే మేమంతా సంఘటితంగా ఉండటంతో విఫలమయ్యారని ఆయన అన్నారు. 
 
విజయం సాధించే వరకు శాంతియుత ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు. డిసెంబర్ 14న చాలా మంది రైతు నాయకులు సింఘు సరిహద్దులో నిరాహార దీక్షలో కూర్చోనున్నారని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు