తమిళనాడులోని చెన్నై నగరంలో పెద్దనోట్ల చెల్లక నానా తంటాలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో ఆ ప్రభావం చేపల పరిశ్రమపై పడింది. తమిళనాడులోని చెన్నై నగరంలో పెద్ద నోట్లు చెల్లక చేపల ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రతిరోజూ మత్స్యకారులు అందరూ కలిసి సముద్రంలోకి వెళ్లి పట్టిన చేపలను విక్రయించడం ద్వారా రోజుకు రూ.10 కోట్లను సంపాదిస్తారు. ప్రస్తుతం రూ.10 లక్షలు కూడా రావడం లేదన్నారు.
కాని పెద్దనోట్ల రద్దుల వల్ల చేపలు పట్టినా కొనేవారు లేక, ఎగుమతి లేక ధరలు పడిపోయాయని జాతీయ మత్స్యకారుల సంఘం ప్రతినిధి నంజాల్ రవి వెల్లడించారు. సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లాలంటే డీజిల్, నెట్స్ కొనుగోలుకు డబ్బు కావాలి.. కానీ పెద్ద నోట్ల రద్దుతో చేపల వేటకు కూడా విఘాతం కలిగిందని రవి తెలిపారు.
ఇదిలా ఉంటే.. పాత నోట్ల రద్దుతో కష్టాలు పడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట కలిగించింది. పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, రైల్వే స్టేషన్లలో నవంబర్ 24 వరకు పాతనోట్లు చెలామణి అవుతాయని ప్రకటించింది. నవంబర్ 14తో ముగుస్తున్న ఈ గడువును 24వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీచేసింది.