కోడెల బీజేపీలో చేరాలనుకున్నారా? అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం..?

బుధవారం, 18 సెప్టెంబరు 2019 (10:42 IST)
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు బీజేపీలో చేరాలనుకున్నారనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కోడెల శివప్రసాద రావు బీజేపీలో చేరాలనుకున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవాలని తనకు అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోడెల తనను సంప్రదించినట్లు రఘురామ్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ తనను ఏకాకిని చేసిందని కోడెల తనకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. కోడెల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఆయన జీవించి ఉండి ఉంటే దసరా తరువాత బీజేపీలో చేరి ఉండేవారని చెప్పుకొచ్చారు. ఓడిపోయేవారిని పక్కనబెట్టే సంస్కృతికి టీడీపీ పెద్ద పీట వేస్తుందని ధ్వజమెత్తారు. 
 
మరోవైపు కోడెల శివప్రసాదరావు మృతిపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో దర్యాప్తు చేయిస్తామని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. కోడెల మృతి చెందడం చాలా బాధగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. 
 
ఏ ప్రభుత్వమైనా చట్టాలను చేతిలోకి తీసుకోకూడదని హితవు పలికారు. రెండు రాష్ట్రాల డీజీపీల నుంచి నివేదికలు తెప్పించుకుంటానని చెప్పారు. కోడెల ఆత్మహత్య వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై తమకు కొన్ని ఫిర్యాదులు అందాయన్నారు.
 
పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయనన్నారు. కోడెలతో తనకు వ్యక్తిగత సంబధాలున్నాయని కేంద్ర మంత్రి గుర్తుచేసుకున్నారు. కోడెల మృతిపై రెండు రాష్ట్రాలు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు