ఈదురు గాలులకు కదిలిన ఇంజిన్ లేని గూడ్సు రైలు.. ఆరుగురి మృతి

గురువారం, 8 జూన్ 2023 (09:19 IST)
ఒడిశా రాష్ట్రంలో మరో విషాదం ఘటన జరిగింది. వానొస్తుందని ఇంజన్ లేని గూడ్సు రైలు కిందకు వెళ్లిన కూలీల్లో కొందరు మృత్యువాతపడ్డారు. ఈదురు గాలుల ధాటికి పట్టాలపై ఆగివున్న గూడ్సు రైలు ముందుకు కదిలింది. దీంతో ఆ రైలు కింద కూర్చొనివున్న కార్మికుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన ఒడిశా రాష్ట్రంలోని ఝాజ్పూర్ రోడ్డు రైల్వే స్టేషన్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఝాజ్పూర్ రోడ్డు రైల్వేస్టేషన్‌లో సేఫ్టీ ట్రాక్‌పై కొద్దిరోజులుగా ఇంజన్ లేని ఖాళీ గూడ్స్ వ్యాగన్లు నిలిపి ఉంచారు. రైల్వే పనుల కోసం బుధవారం 8 మంది కార్మికులు అక్కడికి వచ్చారు. అయితే, వర్షంతో పాటు బలమైన గాలులు రావడంతో వారంతా నిలిపి ఉంచిన గూడ్స్ వ్యాగన్ల కింద తలదాచుకున్నారు. 
 
ఆ సమయంలో ఈదురు గాలులు మరింత బలంగా వీయడంతో గూడ్స్ వ్యాగన్లు ముందుకు కదిలాయి. వాటి చక్రాల కింద ఆరుగురు ప్రాణాలు విడిచారు. దీంతో కార్మికుల నివాసాల్లో విషాదం నెలకొంది. స్థానిక రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు