కోటి రూపాయల కోసం అమ్మమ్మను పాముకాటుతో చంపేశాడు..

సెల్వి

శనివారం, 24 ఫిబ్రవరి 2024 (12:35 IST)
ఛత్తీస్​గఢ్​లోని కాంకేర్​ జిల్లాలో కోటీశ్వరుడు కావాలనే తపనతో ఓ యువకుడు తన అమ్మమ్మను మృతి చెందేలా చేశాడు. ముందుగానే ఆమెకు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ చేయించి, బాధితురాలు మృతి చెందిన తర్వాత ఆ సొమ్మును అందుకున్నాడు. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
 
వివరాల్లోకి వెళితే.. బాందే పోలీస్​స్టేషన్​ పరిధికి చెందిన మృతురాలు రాణి పఠారియా భర్త కొన్ని నెలల క్రితం మరణించాడు. దీంతో రాణి తన కుమార్తె ఇంటికి వచ్చేసింది. అయితే మృతురాలి మనవడు ఆకాశ్​ కోటీశ్వరుడు కావాలని కుట్ర పన్నాడు. 
 
తన అమ్మమ్మను హత్య చేయించాలని ప్లాన్ వేశాడు. అంతకుముందు ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్​ ద్వారా తన అమ్మమ్మ పేరు మీద రూ.కోటి బీమా పాలసీ చేయించాడు. 
 
అయితే పాము కాటుతో బాధితురాలు చనిపోతే బీమా సొమ్ము రూ.కోటి అందుతుందని ఆకాశ్​కు ఏజెంట్ చెప్పాడు. దీంతో బాధితురాలికి పాము కాటు వేయించేందుకు ఆకాశ్​ పథకం వేశాడు. 
 
ఓ వ్యక్తికి రూ.30వేలు సుపారీ ఇచ్చాడు. సుపారీ ఇచ్చిన వ్యక్తి ద్వారా పాముతో కాటు వేయించాడు. దీంతో ఆ మహిళ చనిపోయింది. పాము కాటు వేయడం వల్లే బాధితురాలు చనిపోయిందని అందరినీ నమ్మించాడు ఆకాశ్. 
 
అయితే రాణి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అప్పటికే ప్రారంభించారు. ఇటీవలే మరోసారి బాధితురాలి కుటుంబసభ్యులను విచారించారు.
 
ఆ సమయంలో ఆకాశ్​ పదేపదే మాటలు మార్చాడు. దీంతో అనుమానం పెంచుకున్న పోలీసులు ఆరా తీశారు. దీంతో విచారణలో నిజం ఒప్పుకున్నాడు ఆకాశ్​. అతడిని అరెస్ట్​ చేసిన పోలీసులు- నిందితుల నుంచి రూ.10 లక్షల నగదు, మృతురాలి నగలు స్వాధీనం చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు