అసెంబ్లీలో హై డ్రామా.. తలుపులు మూసేసి... మీడియాను బయటకు గెంటేసి... పన్నీర్‌కు స్టాలిన్ జై

శనివారం, 18 ఫిబ్రవరి 2017 (11:57 IST)
తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకునే నిమిత్తం శనివారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచారు. ఈ ససమావేశాలు ప్రారంభమవ్వగానే లోపలికి ఎవర్నీ రానివ్వకుండా అసెంబ్లీ తలుపులు మూసివేశారు. ఆఖరికి మీడియాను రాకుండా బయటనే అడ్డుకున్నారు. 
 
దీంతో మీడియా మిత్రులు అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు. మీడియాపై ఆంక్షలు విధించడంతో అసెంబ్లీ నుంచి ఎటువంటి సమాచారం బయటికి రావడానికి అవకాశం లేదు. భారీగా పోలీసులు అసెంబ్లీ చుట్టూ మోహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత మధ్య బలపరీక్ష జరుగుతోంది. 
 
ఇదిలావుండగా, సభ ప్రారంభమైన వెంటనే విశ్వాస పరీక్ష తీర్మానాన్ని సీఎం పళనిస్వామి ప్రవేశపెట్టారు. అసెంబ్లీకి మొత్తం 231మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. 
 
రహస్య ఓటింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సభలో మాట్లాడేందుకు పన్నీర్‌కు అవకాశం ఇవ్వాలని స్టాలిన్ కోరారు. పన్నీర్‌సెల్వంకే తమ మద్దతని స్టాలిన్ ప్రకటించారు. ఎమ్మెల్యేలను ఖైదీల మాదిరిగా తీసుకొచ్చారని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి