అమెరికాలో భారతీయులు, పాకిస్తాన్‌లో హిందువులపై దాడులు... చంపేస్తున్నారు...

గురువారం, 9 మార్చి 2017 (14:34 IST)
అమెరికాలో భారతీయులపై దాడులు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు పాకిస్తాన్ దేశంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో గుర్తు తెలియని దుండగులు హిందూ మహిళను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఈ హత్యకు కారణమేమిటన్నది తెలియరాలేదు. మృతురాలు నసీరాబాద్ జిల్లాలోని బాబాకోట్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా ఈ హత్యపై మృతురాలు సోదరుడు జాలోరామ్ మాట్లాడుతూ... తన సోదరిని బడా వ్యక్తులే హత్య చేశారనీ, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ లోని హిందువులపై దాడులు పెరుగుతున్నాయి.
 
మరోవైపు అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులపై పార్లమెంటులో విపక్షాలు ప్రధాని మోదీపై మండిపడ్డారు. అమెరికాలో వరుస ఘటనలు జరుగుతున్నా ప్రధానమంత్రి మౌనాన్ని పాటిస్తున్నారనీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంటులో అమెరికాలో నివాసముంటున్న భారతీయులకు భరోసానిచ్చేందుకు ప్రకటన చేయాలని పట్టుబట్టారు. మంత్రిగారు కేవలం ట్విట్టర్ వరకే పరిమితమయిపోతున్నారనీ, బాధితులతో స్వయంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి