వావ్.. భారత్-పాకిస్థాన్‌ చేతులు కలిపాయా? సూపర్.. ఏ విషయంలో..?

సోమవారం, 28 జూన్ 2021 (18:58 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగా వున్నాయి. ముంబై పేలుళ్ల అనంతరం ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అలాగే భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్‌లు కూడా జరగట్లేదు. 
 
అలాంటిది. మిడతల విషయంలో భారత్-పాకిస్థాన్‌లు ఏకం అయ్యాయి. ఈ దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. దాడులను అరికట్టేందుకు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తుండడం విశేషం. ఇప్పటి వరకు ఇండియా-పాక్ దేశాలు కోటి గుడ్లను నాశనం చేశాయి. ఈ రెండు దేశాల ఉమ్మడి ఆపరేషన్‌ను ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ఆఫ్రికన్ దేశాలు ఈ దేశాలను చూసి నేర్చుకోవాలని హితవు పలికింది.
 
భారతదేశంలో మిడతలు ఏ విధంగా దాడి చేశాయో తెలిసిందే. ఇరాన్, అప్ఘనిస్తాన్ దేశాల నుంచి పాక్, భారత్‌లోకి మిడతలు ప్రవేశించాయి. ఇవి పెద్ద ఎత్తున పంటలను నాశనం చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీటి నివారణకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితాలు కానరాలేదు. 
 
దీంతో ఈ రెండు దేశాలు ఉమ్మడిగా ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించారు. మిడతలకు చెందిన కోటి గుడ్లను నాశనం చేయడంతో వాటి వృద్ధి పెద్దఎత్తున్న నిలిచిపోయింది. ఫలితంగా ఈ ఏడాది ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల నుంచి మిడతలు దాడిచేసే అవకాశాలు లేవు. 
 
మిడతల దాడులను పర్యవేక్షించే ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) సీనియర్ అధికారి కీత్ క్రెస్మాన్.. భారతదేశం-పాకిస్తాన్ సంయుక్త ఆపరేషన్‌ను ప్రశంసించారు. ఇరుదేశాలు మిడతల ఉగ్రవాదాన్ని అడ్డుకున్నాయని చెప్పారు. దీనివల్ల రెండు దేశాల్లోని రైతులుకు ఎంతో లబ్ది చేకూరుతుందని కీత్ క్రెస్మాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు