కూలిన భారత మిగ్‌ విమానం.. ఇద్దరు పైలట్ల మృతి.. పాక్ వాయుసేనకు చెక్

బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:57 IST)
భారత వాయుసేన పాకిస్థాన్ భూభాగంలో దాడులు చేసిన నేపథ్యంలో భారత సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారత సరిహద్దుల్లో భారత సైన్యాన్ని టార్గెట్ చేసి.. పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరుపుతోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఒక యుద్ధవిమానం కూలిపోయింది.


భారత వాయుసేనకు చెందిన మిగ్‌ విమానం ఇదని సైనికాధికారులు చెప్తున్నారు. బుద్గాం జిల్లాలో గరెండ్‌ కలాన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. సాంకేతిక కారణాలతోనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. 
 
యుద్ధవిమానానికి చెందినదిగా భావిస్తున్న వీడియోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఈ ఘటనను అధికారులు ధ్రువీకరించారు. ఇకపోతే.. పాక్‌ యుద్ధవిమానాలు నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి వచ్చి బాంబులు జార విడిచి వెళ్లాయి. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
పాక్‌ యుద్ధవిమానాల కదలికలపై ముందు నుంచే ఒక కన్నేసిన భారత వాయుసేన వెంటనే ప్రతిస్పందించింది. భారత్‌కు చెందిన యుద్ధవిమానాలు వాటిని అడ్డుకొనేందుకు వెళ్లాయి. భారత వాయుసేన విమానాల ప్రతిఘటనతో పాక్‌ విమానాలు తోకముడిచాయి. పూంచ్‌, రాజౌరీ సెక్టార్లలో ఈ ఘటనలు చోటు చేసుకొన్నాయి. భారత్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన విమానాలు పాక్‌ ఎఫ్‌-16 విమానాలుగా భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు