పారాగ్లైడర్ల సాయంతో భారత్‌లోకి పాక్ మిలిటెంట్లు చొరబాట్లు: ఐబీ వార్నింగ్

గురువారం, 6 అక్టోబరు 2016 (08:29 IST)
భారత్‌పై ఉగ్రదాడులకు సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ భూభాగంలో వేచి చూస్తున్న ఉగ్రవాదులు పారాగ్లైడర్లతో దేశంలోకి చొరబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది. భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు పారాచూట్స్ లేదా పారాగ్రైడర్లను ఉపయోగించే అవకాశమున్నట్టు తెలిపింది. 
 
యురీ ఉగ్రదాడి తర్వాత భారత్ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునే పనిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వ్యూహాలు రచిస్తున్నారని, అందువల్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది. ముఖ్యంగా చొరబాట్లతో పాటు, ఆత్మాహుతి దాడులకు కూడా టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్టు ఐబీ సమాచారం. 
 
ప్రధానంగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కాగా, ఐబీ హెచ్చరికల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల వెంబడి ఎగిరే వస్తువులు, పారాగ్లైడింగ్‌పై అధికారులు నిషేధం విధించారు. అదేవిధంగా సరిహద్దు వెంబడి దాడులకు అవకాశాలున్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి