రజనీకాంత్‌తో పొత్తుకు రెడీ.. రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్‌కే మద్దతు: ఓపీఎస్

శుక్రవారం, 23 జూన్ 2017 (10:35 IST)
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఆయన పుట్టిన రోజున ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. రజనీ రాజకీయాల్లోకి వస్తే ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ సీఎం పన్నీర్ సెల్వం వెల్లడించారు. రజనీ రాజకీయ రంగప్రవేశంపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదనే విషయాన్ని ఓపీఎస్ ఎత్తిచూపారు. 
 
అంతేగాకుండా భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లోకి వస్తే పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓపీఎస్ ప్రకటించారు. పళని స్వామి ఇంకా శశికళ అడుగుజాడల్లోనే నడుస్తున్నాడని, తాము మాత్రం పార్టీ, ప్రభుత్వాన్ని ప్రజలకు నచ్చేవిధంగా, ప్రజలు మెచ్చే విధంగా నడిపించాలని కోరుతున్నామని ఓపీఎస్ వెల్లడించారు. ఇందుకు పళని నుంచి ఎలాంటి స్పందనా రాలేదన్నారు. 
 
రాష్ట్రపతి ఎన్నికలపై అన్నాడీఎంకే రెబల్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీకే మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీయే ప్రకటించిన దళిత వర్గం నేత రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆయన మద్దతిచ్చారు. తాము ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తున్నామంటూ చెప్పారు. జూలై 17న రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిగా ఎన్డీయే ప్రభుత్వం రామ్‌నాథ్‌ను ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి