భార్యను వెక్కిరించాడని.. 17ఏళ్ల బాలుడిని నరికి నాలుగు ముక్కలు చేసి వంటగదిలో..?

గురువారం, 31 ఆగస్టు 2023 (22:10 IST)
భార్యను వెక్కిరించాడని 17 ఏళ్ల బాలుడిని ఆటో డ్రైవర్ హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని చెంబూరుకు చెందిన షాబీ సాయక్ (వయస్సు 33) ఆటో డ్రైవర్. 
 
ఇస్లార్ మార్వాడి అనే 17 ఏళ్ల బాలుడు తన భార్యను వెక్కిరిస్తూ, ఆటపట్టించేవాడని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న షాబీ సాయక్ బాలుడిని మందలించాడు. కానీ అతను వినలేదు. నిరంతరం ఆటపట్టిస్తూ ఉండేవాడు. 
 
దీంతో కోపోద్రిక్తుడైన షాబీ సాయక్ ఘటనపై ఇస్లార్ మార్వాడిని కొడవలితో నరికాడు. అతని తలపై సుత్తితో కొట్టాడు. ఈ ఘటనలో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత షాబీ సాయక్ బాలుడి మృతదేహాన్ని 4 ముక్కలుగా నరికి, ఆనవాళ్లను ధ్వంసం చేసేందుకు పెద్ద సంచుల్లో ప్యాక్ చేశాడు. 
 
అనంతరం శరీర భాగాలతో కూడిన బ్యాగులను ఇంట్లోని వంటగదిలో దాచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. దీనికి సంబంధించి షాబీ సాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
హత్యకు గురైన బాలుడిని రెండేళ్ళ క్రితం గృహప్రవేశం, చోరీ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత జువైనల్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న అతడు డ్రగ్స్‌కు బానిసయ్యాడని పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు