చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన పూర్తి

మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (10:59 IST)
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను భారతీయ ఇంజనీర్లు నిర్మించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని చీనాబ్ నదిపై ఈ వంతెనను నిర్మించారు. ఈ నదిపై 359 మీటర్ల ఎత్తు ఉన్న రైల్వే బ్రిడ్జిపై చేపట్టిన ఆర్చ్‌ నిర్మాణం సోమవారం పూర్తయింది. 
 
ఈ సందర్భంగా నార్త్‌రన్‌ రైల్వే ఉన్నతాధికారులు మాట్లాడుతూ, దీనిని మైలు రాయిగా అభివర్ణించారు. 1.3 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జిని రూ.1.486 కోట్లలో నిర్మాణం చేసినట్లు చెప్పారు. కాశ్మీర్‌ లోయను ఈ బ్రిడ్జి ఉధంపూర్‌ - శ్రీనగర్ ‌- బారాముల్లా రైల్వే లింక్‌ ప్రాజెక్టుతో అనుసంధానిస్తుందని అన్నారు. ఫలితంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ప్రాంతాలను కలిపినట్టయింది. 
 
కాగా, పారీస్‌లోని ఈఫిల్‌ టవర్‌ కంటే 35 మీటర్లు ఎత్తైన ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందన్నారు. అయితే ఉత్తర రైల్వేకు ఐదో చారిత్రాత్మక రోజని, యూఎస్‌బీఆర్‌ఎల్‌ ప్రాజెక్టును పూర్తి చేయడంలో ఇదో మైలు రాయి అని నార్తరన్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ అశోతోష్‌ గంగాల్‌ అన్నారు. 
 
అయితే మొత్తం ప్రాజెక్టు రెండున్నరేళ్లలో పూర్తవుతుందని చెప్పారు. కేబుల్‌ క్రేన్‌ ద్వారా ఆర్చ్‌ సెగ్మెంట్‌ను అమర్చడాన్ని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీ నుంచి వీడియో లింక్‌ ద్వారా వీక్షించారు. గంగాల్‌, కొంకణ్‌ రైల్వే చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
 
ఈ వంతెన నిర్మాణంలో 28,660 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 66 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని జరిగినట్లు తెలిపారు. ఆర్చ్‌ మొత్తం బరువు 10,619 టన్నులని అన్నారు. ఇలాంటి నిర్మాణం భారతీయ రైల్వే చరిత్రలో ఇదే తొలిసారని వివరించారు. 
 
గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల నుంచి, అత్యంత తీవ్రతతో సంభవించే భూకంపాల నుంచి తట్టుకునే శక్తి ఈ బ్రిడ్జికి ఉంటుందన్నారు. బ్రిడ్జి నిర్మాణంలోని వివిధ భాగాలను కలిపేందుకు దాదాపు 584 వెల్డింగ్ వర్క్ జరిగినట్టు చెప్పారు. ఆర్చ్ నిర్మాణంలో అసలైన సవాలు సోమవారంతో ముగిసిందని కొంకణ్‌ రైల్వే చైర్మన్‌ సంజయ్‌ గుప్తా తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు