నేటి సాయంత్రంతో ప్రచారానికి బంద్ : 6న పోలింగ్

ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (09:38 IST)
తమిళనాడుతో సహా పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడనుంది. ఈ నెల 6వ తేదీన పోలింగ్ జరుగనుంది. ప్రచారంలో భాగంగా హోరెత్తిన మైకులు మూగబోనున్నాయి. ఈ నెల 6న పోలింగ్‌ జరగనుంది. ఒకే విడతలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్‌కు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
ఎన్నికల కోసం మొత్తం 1,55,102 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. 80 ఏళ్ల పైబడిన వారికి పోస్టల్‌ ఓట్లు వేసేలా అధికారులు అవకాశం కల్పించారు. దీని కోసం 2.44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. అయితే పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు ఇప్పటికే అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 
 
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల బరిలో ఉన్నాడీఎంకే, డీఎంకే, కమల్‌హాసన్‌, దినకరన్‌ పార్టీలతో పాటు పలు రాజకీయ పక్షాలు బరిలో ఉన్నాయి. అయితే అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఇరు పక్షాలకు చెందిన రాష్ట్ర జాతీయ పార్టీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా, రాహుల్‌ గాంధీ ఇతర కూటముల పక్షాన ప్రచారం నిర్వహించారు.
 
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గడువు మే 24వ తేదీతో ముగియనుంది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ తదితర పక్షాలు ఉండగా, డీఎంకే నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్‌, మరికొన్ని పార్టీలు ఉన్నాయి. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో 25 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు