మరోవైపు శిశకళ అనుచరుడిగా పేరున్న శేఖర్ రెడ్డి ఆస్తుల పైన దాడులు జరిగాయి. కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టి ఆదాయపు పన్నుశాఖకు అడ్డంగా దొరికిపోయిన శేఖర్ రెడ్డి ముందు నుంచీ అదేవిధంగా వ్యవహరించేవారని తెలుస్తోంది. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన శేఖర్ రెడ్డి ప్రస్తుతం కోట్లకు పడగలెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ఎలాంటి నిర్ణయాలున్నా పట్టించుకోకుండా కేవలం దర్శనం కోసమే పాలకమండలి సభ్యుడయ్యాడన్న విమర్శలు లేకపోలేదు.
టిటిడి పాలకమండలి పదవి అంటే అందరూ ఆ వైపే చూస్తుంటారు. ఆ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ ప్రస్తుతమున్న శేఖర్ రెడ్డి పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధం. జయలలిత వద్దకు వెళ్లి టిటిడి పాలకమండలి సభ్యుడిగా కావాలంటూ ఒక చిన్న సందేశాన్ని ఇచ్చాడు ఆయన. అంతే... జయమ్మ నేరుగా సిఎం బాబుకు ఫోన్ చేయడం.. పాలకమండలి సభ్యుడిగా శేఖర్ రెడ్డి అయిపోవడం అన్నీ జరిగిపోయాయి.
శేఖర్ రెడ్డికి సామాన్య భక్తులకు ఎలాంటి నిర్ణయాలు అవసరమో ఇప్పటికీ తెలియదు. ఆయన నేరుగా పాలకమండలి సమావేశానికి రావడం... కూర్చోవడం.. తిరిగి వెళ్లిపోవడం.. ఇది మాత్రమే తెలుసు అనే ఆరోపణలున్నాయి. అసలు ఆయన ఎందుకు సమావేశానికి వస్తారో.. ఎందుకు వెళ్ళిపోతారో చాలామందికి తెలియదు. ఒక్కోసారి బిజీ అంటూ అసలు సమావేశానికే రారు. కేవలం దర్శనం చేసుకోవడానికి, తన వారికి దర్శనం చేయించడానికి మాత్రమే శేఖర్ రెడ్డి ఈ పదవి సంపాందించుకున్నారన్న విమర్శలు లేకపోలేదు.
టిటిడి పాలకమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం తరువాత ఒక్కటంటే ఒక్క నిర్ణయాన్ని కూడా సమావేశంలో శేఖర్ రెడ్డి పెట్టలేదంటే ఆయన ఏ మాత్రం సభ్యుడిగా పనిచేస్తున్నాడో అందరికీ అర్థమైపోతుంది. దీంతో పాలకమండలిలోనే తనకేం సంబంధం లేదని వ్యవహరించేవారిలో ప్రథముడు శేఖర్ రెడ్డి అని టక్కున మిగిలిన పాలకమండలి సభ్యులు చెప్పేస్తుంటారు. మరి ఐటీ దాడుల నేపధ్యంలో ఆయనను తితిదే పదవిలో కొనసాగిస్తారో లేదో చూడాలి.