జమ్ముకాశ్మీర్‌ తొలి మహిళా బస్సు డ్రైవర్‌

ఆదివారం, 27 డిశెంబరు 2020 (06:23 IST)
జమ్ముకాశ్మీర్‌లోని కథువాకి చెందిన పూజాదేవి జమ్ముకాశ్మీర్‌లో ప్రయివేటు బస్సు నడుపుతూ అక్కడ తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా రికార్డులకెక్కింది. పూజాదేవి జమ్ముకాశ్మీర్‌లోని కథువా జిల్లాలో పుట్టారు. తండ్రి సన్నకారు రైతు. తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమెను చదివించలేకపోయారు.

కానీ పూజాదేవికి మాత్రం చిన్నప్పటి నుంచే డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టమట. కొన్నిరోజులు డ్రైవింగ్‌ స్కూల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. టాక్సీలు కూడా నడిపారామె. బస్సు లేదా ట్రక్కు నడపాలనీ.. ప్రొఫెషనల్‌ డ్రైవర్‌ అవ్వాలనే కోరిక ఉండేదట. మొదట డ్రైవర్‌గా మారతానని భర్తకు చెప్పినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. ఆడవాళ్లకి డ్రైవింగ్‌ సరైన వృత్తి కాదని వ్యతిరేకించారు.

అయితే తాను మాత్రం పట్టువదలకుండా.. చదువుకోలేదు కాబట్టి.. ఉద్యోగం రాదు, ఆర్థిక పరిస్థితుల వల్ల తప్పనిసరిగా ఏదో ఒక పని చేయాలి.... అందుకే డ్రైవింగ్‌నే వృత్తిగా మలుచుకుటాను... అని ఆమె భర్తతో చెప్పి ఆయన్ని ఒప్పించారు. కానీ ప్రొఫెషనల్‌గా డ్రైవింగ్‌ చేయడం అంటే మాములు విషయం కాదు.. అయినా ఆమె తన మేనమామ సాయంతో డ్రైవింగ్‌ నేర్చుకుని.. హెవీ వెహికల్‌ లైసెన్స్‌ తీసుకున్నారు.

ఆ తర్వాత బస్సు డ్రైవర్‌గా జమ్ము - కథువా బస్సు యూనియన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ యూనియన్‌ వాళ్లు తన మీద ఉన్న నమ్మకంతో డ్రైవర్‌గా చేర్చుకున్నారు. గత గురువారమే ఆమె తొలిసారిగా.. ప్రయాణికుల బస్సు నడిపారు. అలా బస్సు నడపడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని పూజా తెలిపారు.

బస్సు ఎక్కేటప్పుడు ప్రయాణికులు తనను చూసి తొలుత ఆశ్చర్యపడ్డా... ఆ తర్వాత తననెంతో మెచ్చుకున్నారట. పూజకు ముగ్గురు పిల్లలు. అందులో చిన్నవాడు తనని వదిలిపెట్టకపోవడంతో.. బాబుని కూడా బస్సులోనే వెంట తీసుకెళతానని చెబుతున్నారామె. తననెవరైనా డ్రైవర్‌గా ఎందుకు మారారు అని అడిగితే. 'నేటి ఆడవాళ్లు యుద్ధ విమానాలే నడుపుతున్నారు బస్సు నడిపితే తప్పేంటి' అని పూజ జవాబిస్తోంది.

పూజాదేవి బస్సు నడిపే ఫొటోలు కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. అవి వైరల్‌ అయ్యాయి. దీంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ ఈమె ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 'జమ్మూ కశ్మీర్‌ తొలి మహిళా బస్సు డ్రైవర్‌ పూజాదేవి. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది' అని కొనియాడారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు