పాకిస్థాన్ ప్రాచీన ఆలయంలో ఘంటసాల పాట వినిపించిన జ్యోతి మల్హోత్రా!!

ఠాగూర్

మంగళవారం, 20 మే 2025 (12:37 IST)
శత్రుదేశం పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి లోతుగా విచారణ జరిపేకొద్దీ అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఆమెకు పాకిస్థాన్‌కు చెందిన అనేక మందితో సంబంధం ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్‌‍లోని ఓ ప్రాచీన ఆలయంలో గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన అచ్చ తెలుగు పాట వినిపించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. 
 
ఈమె గతంలో చిత్రీకరించిన ఓ వీడియో ద్వారా ఈ ఆసక్తికర దృశ్యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. తెలుగువారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సుమారు రెండు నెలల క్రితం పాకిస్థాన్‌లోని ప్రసిద్ధ కటాస్ రాజ్ ఆలయ సముదాయాన్ని సందర్శించింది. 
 
ఆ పర్యటనలో భాగంగా ఆలయ విశిష్టతను వివరిస్తూ ఆమె ఓ వీడియోను చిత్రీకరించి తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌‍లోడ్ చేశారు. ఆ వీడియోలో 6 నిమిషాల 50 సెకన్ల వద్ద జ్యోతి మల్హోత్రా కటాస్ రాజ్ ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయం వైపు వెళుతుండగా ఓ అద్భుతం చోటుచేసుకుంది.
 
ఆలయం లోపలి నుంచి ఎవరో ఒక వ్యక్తి అత్యంత మధురంగా, భక్తిశ్రద్ధలతో ఓ తెలుగు సినిమా పాటను పాడుతుండటం స్పష్టంగా వినిపించింది. మన ఘంటసాల మాస్టారు పాడిన 'భూకైలాస్' చిత్రంలోని ‘రాముని అవతారం రవికుల సోముని అవతారం' అనే సుప్రసిద్ధ గీతం. ఆలయంలో 'కూర్చుని ఓ
పెద్దాయన ఈ పాటను ఆర్తితో ఆలపిస్తున్న దృశ్యం కూడా వీడియోలో కనిపించింది. పరాయి దేశంలో, అందులోనూ పాకిస్థాన్‌లో మన తెలుగు పాట, అదీ ఘంటసాల గళమాధుర్యాన్ని గుర్తుకుతెచ్చేలా ఓ వ్యక్తి పాడుతుండటం తెలుగువారందరినీ ఆకట్టుకుంటోంది.
 
కాగా, జ్యోతి మల్హోత్రా ఇటీవల గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు కావడంతో ఆమె యూట్యూబ్ ఛానల్‌లోని వీడియోలపై చాలామంది దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కటాస్ రాజ్ ఆలయ వీడియోలోని ఈ అరుదైన ఘట్టం బయటకు వచ్చి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. దేశాలు వేరైనా, భాషలు వేరైనా సంగీతానికి, ముఖ్యంగా మన ఘంటసాల పాటలకు సరిహద్దులు లేవని ఈ సంఘటన నిరూపిస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు