కర్నాటక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు : ఊపరిపీల్చుకుంటున్న కమలనాథులు

సోమవారం, 9 డిశెంబరు 2019 (11:10 IST)
కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. సోమవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, పలుచోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఏమాత్రం తేడా వచ్చిన కర్నాటకలోని ముఖ్యమంత్రి యడ్యూరప్ప సర్కారు కుప్పకూలిపోయే అవకాశం ఉంది. దీంతో ఈ ఉప ఎన్నికలను కమలనాథులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 
 
గతంలో కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి పార్టీ ఫిరాయించిన 15 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమైన విషయం తెల్సిందే. ఈనెల ఐదో తేదీన రాష్ట్రంలోని గోకాక్‌, కాగవాడ, అథణి, యల్లాపుర, రాణేబెన్నూరు, హీరేకెరూర్‌, హోసకోటే, కె.ఆర్‌.పురం, శివాజీనగర, మహాక్ష్మి లేఅవుట్‌, యశవంతపుర, విజయనగర, కె.ఆర్‌.పేట, హుణసూరు, చిక్కబళ్లాపుర నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.
 
కాంగ్రెస్‌, బీజేపీలు అన్ని స్థానాలకు పోటీ చేయగా జేడీఎస్‌ 12 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించింది. ఈ 15 స్థానాల్లో కనీసం ఆరు స్థానాల్లో బీజేపీ గెలుపొందక తప్పని పరిస్థితి. 'అధికార పార్టీకి ఇదేమంత కష్టమైన పనా?'  అని అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న స్థానాలన్నీ విపక్ష పార్టీలు గెలుపొందినవి కావడమే ఆ పార్టీలో టెన్షన్‌కు కారణం.
 
ఈ పరిస్థితుల్లో సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా, తొలి ఫలితాల్లో బీజేపీ 10 స్థానాల్లోనూ, కాంగ్రెస్‌ రెండింట, ఒకచోట జేడీఎస్‌ అభ్యర్థులు మెజార్టీలో ఉన్నట్టు సమాచారం. ఈ వార్తలతో కమలనాథులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు