రామాయణం పరీక్షలో కర్ణాటక ముస్లిం అమ్మాయి టాపర్: 93 శాతంతో..?

ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (16:16 IST)
రామాయణం పరీక్షలో ముస్లిం విద్యార్థిని టాపర్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరుకు చెందిన ఫాతిమత రాహిలా అనే బాలిక బడగన్నూరు గ్రామంలోని సుళ్య సర్వోదయ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 'భారత సంస్కృతి ప్రతిష్టాన' సంస్థ ఇటీవల రామాయణంపై పరీక్షలు నిర్వహించింది. మొత్తం 35 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు.
 
అందులో ఫాతిమత రాహిలా కూడా ఉంది. ఈ పరీక్షల్లో 93 మార్కులు సాధించిన ఫాతిమత టాపర్‌గా నిలిచింది. కాగా, తమ పాఠశాల విద్యార్థిని సాధించిన విజయంపై ప్రధానోపాధ్యాయుడు శివరాం హర్షం వ్యక్తం చేశారు. ఫాతిమత రామాయణంలో టాపర్‌గా నిలిచేందుకు తీవ్రంగా కృషి చేసిందని ఆమె తండ్రి ఇబ్రహీం వెల్లడించారు. కాగా ఇబ్రహీం ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, ఆమె భార్య, ఫాతిమత తల్లి గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

వెబ్దునియా పై చదవండి