తనను లైంగికంగా వేధించిన ఇంటి యజమానిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్ కోర్టు విధించిన ఉరిశిక్ష రద్దు అయిందంటూ వస్తున్న వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. "నిమిషా ప్రియ కేసుపై కొందరు వ్యక్తులు పంచుకుంటున్న సమాచారం పూర్తిగా తప్పు" అని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. నిమిష ప్రియ ఉరిశిక్ష అధికారికంగా రద్దు అయినట్టు ఇండియా గ్రాండ్ ముష్తీ కంఠాపురం ఏపీ అబూబక్కర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది.
అయితే, యెమెన్ ప్రభుత్వం నుంచి అధికారిక రాతపూర్వక నిర్ధారణ ఇంకా అందలేదని కార్యాలయం స్పష్టం చేసింది. అయితే, ప్రకటనను భారత ప్రభుత్వం ఈ వార్తలను ఖండించింది. బాధితుడి కుటుంబం నుంచి పూర్తి ఏకాభిప్రాయం లభించకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల నర్సు నిమిష ప్రియ మెరుగైన ఉపాధి కోసం 2008లో యెమెన్కు వెళ్లారు. అక్కడ ఆమె సొంత క్లినిక్ ప్రారంభించేందుకు యెమెన్కు చెందిన వ్యాపారవేత్త తలాల్ అబ్ద్ మహీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. అయితే, ఈ భాగస్వామ్యం కాలక్రమేణా వివాదాస్పదంగా మారింది. మహీ తన పాస్పోర్టును జప్తు చేశారని, తనను దారుణంగా హింసించారని, క్లినిక్ ఆదాయాన్ని దుర్వినియోగం చేశారని నిమిష ఆరోపించారు.
2017లో తన పాస్పోర్టును తిరిగి పొందేందుకు మహీకి సెడేటివ్స్ ఇంజెక్ట్ చేసింది. ఈ ప్రయత్నం దురదృష్టవశాత్తు మహీ మరణానికి దారితీసింది. ఆ తర్వాత, ఆమె ఆయన శరీరాన్ని ముక్కలుగా చేసి, వాటర్ ట్యాంక్లో పడవేసింది. ఈ కేసులో 2018లో అరెస్టు అయిన నిమిష ఆ తర్వాత దోషిగా తేలింది. 2020లో సనా ట్రయల్ కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించింది. 2023లో యెమెన్ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ఆమె అప్పీల్ను తిరస్కరించింది. ఈ పరిస్థితుల్లో ఆమెను రక్షించేందుకు భారత ప్రభుత్వం పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.