ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పశువుల దాణా కుంభకోణం కేసుల నుంచి విముక్తి కల్పించాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటీషన్ను కొట్టివేసిన కోర్టు... ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి.. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ సీబీఐను ఆదేశించింది.
అలాగే, లాలూపై అభియోగాలను జార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. సోమవారం సుప్రీంకోర్టు పనివేళలు ప్రారంభమైన కొద్ది సేపటికే జస్టిస్ అమితావ్ రాయ్, జస్టిస్ పీసీ ఘోష్లతో కూడిన ధర్మానం తీర్పు వెల్లడించింది.
బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ పనిచేసిన సమయంలో చోటుచేసుకున్న పశువుల దాణా కుంభకోణంపై దర్యాప్తు చేసిన సీబీఐ.. మొత్తం నాలుగు కేసులను నమోదుచేసింది. వీటిల్లో ఒక కేసుకు సంబంధించి 2013లోసీబీఐ కోర్టు లాలూ ప్రసాద్ను దోషిగా నిర్ధారించి, ఐదేళ్లు జైలు శిక్ష విధించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ లాలూ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. 2014లో జార్ఖండ్ హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఐపీసీ సెక్షన్ 120, 120B, 409, 420, 471, 477, 477A, 13(2)ల కింద సీబీఐ లాలూపై మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టేసింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ విచారణకు ఇపుడు కోర్టు అంగీకారం తెలిపింది.