మే చివరి వరకు లాక్ డౌన్.. ఇటలీని అనుసరించనున్న భారత్?

గురువారం, 30 ఏప్రియల్ 2020 (18:32 IST)
కరోనా వైరస్ కారణంగా ప్రజల రక్షణార్థం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు.. కొన్ని రాష్ట్రాలు స్వతహాగా లాక్ డౌన్ విధిస్తున్నాయి. అలా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను బెంగాల్ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. 
 
అయినప్పటికీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే చివరి వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్లు బెంగాల్ సర్కారు ప్రకటించింది. చిన్న దుకాణాలు, ఎంపిక చేసిన గ్రీన్ జోన్లలో వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 వరకు లాక్ డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఇటలీ మార్చి పదో తేదీన దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. యూరప్‌లో అన్ని దేశాలకన్నా ముందుగా లాక్‌డౌన్‌ ప్రకటించిన దేశం ఇటలీనే. ఇటలీలో తొలి కరోనా కేసు ఏప్రిల్‌ 20వ తేదీన వెలుగులోకి రాగా, లాక్‌డౌన్‌ ప్రకటించిన మార్చి 10వ తేదీకి మధ్య 20 రోజుల వ్యవధి ఉండింది. 
 
ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులున్న మూడవ దేశంగా, కరోనా మరణాల్లో అమెరికా తర్వాత రెండో దేశంగా ఇటలీ వార్తల్లో ఎక్కడంతో 'లాక్‌డౌన్‌'ను ప్రకటించడంలో ప్రధాన మంత్రి గిసెప్పీ కాంటే ఆలస్యం చేశారని ప్రతిప్రక్ష పార్టీలు దుమ్మెత్తి పోశాయి. ఈ నేపథ్యంలో మే నాలుగవ తేదీన లాక్‌డౌన్‌‌ను సంపూర్ణంగా ఎత్తివేయమని, రోజువారి సడలింపులతో క్రమంగా ఎత్తివేస్తామని ఆయన ప్రకటించారు. 
 
మే నాలుగవ తేదీన ప్రజలు తమ మున్సిపాలిటీ పరిధులు దాటి సెల్ప్‌ డిక్లరేషన్‌ ద్వారా ఇతర ప్రాంతాల్లో ప్రయాణించవచ్చు. ప్రజల వ్యాయామం కోసం పార్కులు, గార్డెన్లు తెరుస్తారు. సన్‌బాతింగ్, క్రీడలను అనుమతించరు. బార్లు, రెస్టారెంట్లు ఆన్‌లైన్‌ ద్వారానే అమ్మకాలు జరపాలి. అంత్యక్రియలకు 15 మందికి మించి హాజరుకారాదు. అతి తక్కువ మందితో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను అనుమతిస్తారు. 
 
మే 18వ తేదీ నుంచి రిటైల్‌ షాపింగ్, మ్యూజియంలు, లైబ్రరీలు, సాంస్కృతిక కేంద్రాలను తెరుస్తారు. జూన్‌ ఒకటవ తేదీ నుంచి బార్లు, రెస్టారెంట్లు, హేర్‌ డ్రెసర్స్, వెల్‌నెస్‌ సెంటర్లు తెరుస్తారు. అయితే ప్రజలు అన్ని వేళల, అన్ని చోట్ల మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం షరతులు విధించింది.
 
సెప్టెంబర్‌ నెల నుంచి విద్యా సంస్థలను తెరవాలని, నైట్‌క్లబ్బులను, సినిమా హాళ్లను, మత కార్యక్రమాలను అనుమతించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇటలీ తరహాలో భారత్ కూడా లాక్ డౌన్ కొనసాగిస్తుందని తెలుస్తోంది. భారత్‌ లాక్‌డౌన్‌ మే 3వ తేదీన ముగిసిపోనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు